Indian Rupee | ముంబై, జూలై 7: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. దేశీయ కరెన్సీ వరుస నష్టాల్లో కదలాడుతున్నది. గత 3 రోజులు క్షీణించిన రుపీ.. శుక్రవారమూ కోలుకోలేదు. తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్పంగా తగ్గి 82.61 వద్ద నిలిచింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో భారతీయ కరెన్సీ విలువ 70 పైసలను కోల్పోయినైట్టెంది. గురువారం 35 పైసలు, బుధవారం 24 పైసలు, మంగళవారం 10 పైసల చొప్పున రుపీ నష్టాలపాలైనది తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల, నిరాశపర్చిన దేశ స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు చమురు దిగుమతిదారులు, హెడ్జర్ల నుంచి పెరిగిన డాలర్ల కొనుగోళ్లు వంటివి రూపాయిని క్రమేణా బలహీనపర్చాయి. గురువారం గడిచిన 5 నెలల్లో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ 35 పైసలు పతనమైంది. ఇక వచ్చే వారం కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చన్న అంచనాలు ఫారెక్స్ మార్కెట్ నిపుణుల నుంచి వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
రూపాయి మారకం విలువ ఇంకా పడిపోతే తిప్పలు తప్పవని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. వరుస నష్టాలతో ఇప్పటికే 83 దరిదాపుల్లోకి వచ్చిందని, మరిన్ని నష్టాలు వాటిల్లితే దిగుమతులు భారమై.. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయని, ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తే ఆర్బీఐ వడ్డీరేట్లను తిరిగి పెంచడం ఖాయమన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు నిర్మాణ ఇతరత్రా రంగాలకూ దెబ్బేనని పేర్కొంటున్నారు. రుణాలు భారమవడం, కొనుగోళ్లు పడిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్తున్నారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) నుంచి పెట్టుబడులు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో రూపాయి విలువ పడిపోయినా.. దేశంలో ఫారెక్స్ రిజర్వులు ప్రభావితం కావడం లేదు. అయితే ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెడితే.. రుపీ క్షీణత భారత ఎకానమీపై తీవ్రంగానే ఉంటుందని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు. రుపాయి బలహీనతకు కరిగిపోయే ఫారెక్స్ రిజర్వులు తోడైతే అంతర్జాతీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నవేళ ఆ నష్టం చాలా విస్తృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.