Layoffs 2023 | అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలకు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా వదల్లేదు. ఫలితంగా అమెరికాలోని వివిధ రంగాల కంపెనీలు పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. అందుకోసం భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు పాల్పడుతున్నాయి. గత రెండు నెలల్లోనే 1.80 లక్షల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి అమెరికన్ కంపెనీలు. వాటిలో జనవరిలో 1,02,943 మంది ఉద్యోగాలు కోల్పోతే, గత నెలలో 77,770 మందికి కంపెనీలు పింక్ స్లిప్లు అందజేశాయి. ఫిబ్రవరి ఉద్వాసనల్లో 21,387 మందిని టెక్నాలజీ కంపెనీలు సాగనంపాయి. గత నెల మొత్తం ఉద్యోగుల లే-ఆఫ్స్లో టెక్ రంగంలో 28 శాతం మంది ఉంటారని అమెరికా ఔట్ప్లేస్మెంట్ సర్వీసెస్ సంస్థ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తేల్చింది. గతేడాది ఇదే కాలంలో టెక్ వరల్డ్ 63,216 మందిని తొలగించేసింది.
అమెరికాలోని పలు కంపెనీలు ఆర్థిక మాంద్యంతో తలెత్తే విపత్కర పరిస్థితులను కొన్ని నెలల పాటు ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం అవుతున్నాయని చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ ఆండ్రూ చాలెంజర్ చెప్పారు. ఇతర రంగాల్లో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు పరిస్థితులు విషమిస్తే చివరి దశలో ఉద్యోగుల తొలగింపు ఆప్షన్ అమలు చేస్తున్నాయన్నారు.
హెల్త్కేర్ ఉత్పత్తుల రంగంలో గత నెలలో 9749 మంది ఉద్యోగాలు కోల్పోయాయి. గత నెలలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో హెల్త్కేర్ రంగ నిపుణులు రెండో స్థానంలో ఉంటారు. ఏడాది కాలంలో 16,482 మంది హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ కొలువులు కోల్పోయారు. గతేడాదితో పోలిస్తే 85 శాతం మంది ఉద్యోగులు అధికంగా నిరుద్యోగులుగా మారిపోయారు.
ఇక రిటైల్, ఫైనాన్సియల్, ఫిన్టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు వెనుకాడడం లేదు. 2023లో రిటైల్ రంగం 17,456 మంది సిబ్బందిని తొలగించింది. 2022లో కేవలం 761 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీని ప్రకారం ఏడాది కాలంలో 2194 శాతం మంది నిరుద్యోగులుగా మారారు. ఫైనాన్సియల్ కంపెనీలు 17,235 మందిని (గతేడాదితో పోలిస్తే 1401 శాతం ఎక్కువ మంది) తొలగించాయి. ఫిన్టెక్ కంపెనీలు 4675 మంది ఉద్యోగులను గత రెండు నెలల్లోనే ఇంటికి సాగనంపాయి. మీడియారంగ కంపెనీలు సైతం 9738 మందిని తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి.
ఒకవైపు పొదుపు చర్యలు, ఉద్యోగుల ఉద్వాసనకు దిగుతున్న అమెరికా కార్పొరేట్ కంపెనీలు అమెరికా ఫెడ్ రిజర్వు తీసుకునే నిర్ణయాలపై కన్నేశాయి. మరోమారు యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచితే ఆర్థిక మాంద్యం ప్రభావం మరింత పెరుగుతుందని చాలెంజర్ పేర్కొంది.