UPI Payments | వచ్చే మూడేండ్లలో పేటీఎం, జీ-పే, ఫోన్పే వంటి యాప్స్ ఆధారిత పేమెంట్స్ ప్రతి రోజు 100 కోట్లకు చేరుకుంటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ దిలిప్ అస్బే చెప్పారు. ప్రపంచంలోకెల్లా భారత్ చెల్లింపుల వ్యవస్థ బెస్ట్గా నిలుస్తుందన్నారు. మంగళవారం ఓ ఆంగ్లదిన పత్రిక నిర్వహించిన ఇండియా ఫిన్టెక్ కాంక్లేవ్లో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తే వచ్చే రెండు, మూడేండ్లలో అంటే 2025 నాటికి 100 కోట్ల లావాదేవీలకు చేరుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజురోజుకి యూపీఐ లావాదేవీలు ఆల్టైం రికార్డులు నెలకొల్పుతున్న నేపథ్యంలో దిలీప్ అస్బే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
గతేడాది ఫిబ్రవరి నుంచి రోజువారీ యూపీఐ లావాదేవీలు 50శాతం పెరిగాయి. గత 12 నెలల్లో రోజువారీ లావాదేవీలు 36 కోట్లను దాటాయి. విలువ రూపేణా 17 శాతం పెరిగినట్లు ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రతి రోజూ రూ.6.27 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి.
తదుపరి యూపీఐ పేమెంట్స్ గ్రోత్లో పేమెంట్ అండ్ ఇన్నోవేషన్లో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయ పద్దతులను గుర్తించాల్సి ఉందని రాజోర్పే కో-ఫౌండర్ కం సీఈవో హర్షిల్ మాథూర్ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో యూపీఐ చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని పూడ్చేందుకు పేమెంట్స్లో ఇన్నోవేషన్ తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగా కొనసాగించాల్సి ఉందని దిలీప్ అస్బే చెప్పారు.