UPI Payments | ముంబై, డిసెంబర్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. దవాఖానలు, విద్యా సంస్థలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే చెల్లింపులకున్న పరిమితిని రూ.5 లక్షలదాకా పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇది లక్ష రూపాయలుగానే ఉండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఐదో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలై మూడు రోజులు కొనసాగింది. ఇందులోని నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఉన్న వివిధ రకాల పరిమితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగానే ఇప్పుడు ‘హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కోసం యూపీఐ లావాదేవీలకున్న పరిమితిని లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలదాకా పెంచుతున్నాం’ అని ప్రకటించారు. విద్య, వైద్య అవసరాల కోసం యూపీఐ చెల్లింపులు జరిపే కస్టమర్లకు మా నిర్ణయం ఉపయుక్తంగా ఉండగలదన్న ఆశాభావాన్ని దాస్ వ్యక్తం చేశారు.
రికరింగ్ పేమెంట్స్ కోసం ఈ-మ్యాండేట్స్ (మానవ జోక్యం లేని డిజిటల్ పేమెంట్ సర్వీస్)కున్న పరిమితిని కూడా లక్ష రూపాయలకు ఆర్బీఐ పెంచింది. ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.15,000 నుంచి లక్షకు పెంచుతున్నామని దాస్ స్పష్టం చేశారు. దీంతో ఇకపై మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిల రికరింగ్ పేమెంట్స్ మరింత సులభతరం అవుతాయని వివరించారు. కాగా,ఫిన్టెక్ ఎకోసిస్టమ్కు మద్దతునిచ్చేలా ఈ రంగంలో వచ్చే మార్పులపై అవగాహనను పెంచేలా ఫిన్టెక్ రెపాజిటరీని ఏర్పాటు చేస్తామని దాస్ ప్రకటించారు.
నన్ను కేవలం ‘గవర్నర్’ అని పిలిస్తే చాలని, ‘గౌరవనీయులైన గవర్నర్’ అని పిలవనక్కర్లేదని శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం ద్రవ్యసమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ ఆర్బీఐ సభ్యుడు దాస్నుద్దేశించి మాట్లాడుతూ ‘గౌరవనీయులైన గవర్నర్’ అని సంబోధించారు. ఈ క్రమంలోనే దాస్ పైవిధంగా స్పందించారు. అయితే ప్రధాని మోదీ సైతం తనను మోదీ అంటే చాలని, మోదీజీ అని గౌరవసూచక పదాలేవీ వాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇక త్వరలోనే దాస్.. ఆర్బీఐ గవర్నర్గా ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. మూడేండ్ల తొలి విడుత ముగియడంతో మళ్లీ ఆయన్నే కేంద్రం కొనసాగిస్తున్నది. ఉర్జిత్ పటేల్ రాజీనామాతో దాస్ ఆర్బీఐ గవర్నర్గా వచ్చినది తెలిసిందే.