UPI Server Down | యూపీఐ పేమెంట్స్ అమల్లోకి రావడంతో చెల్లింపులు చాలా తేలిక అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రజలంతా నూతన వసంతానికి స్వాగతం పలికేందుకు పరుగులు తీస్తున్నారు. విందులు, వేడుకలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ.. యూపీఐ పేమెంట్స్ ( UPI Payments ) నిలిచిపోయాయి. ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకల షాపింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ పేమెంట్స్ సేవలు నిలిచిపోవడం యూజర్లకు ఆందోళన కలిగిస్తున్నది. నెటిజన్లు ట్విట్టర్ వేదికగా `యూపీఐ`కి ఏమైందంటూ విమర్శలు చేస్తున్నారు. వేల మంది ట్విట్టరీలు #UPIDOWN అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ ద్వారా యూపీఐ మోడ్ పేమెంట్స్ జరుగుతాయి. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో ఆయా యాప్లతో పేమెంట్స్ స్తంభించి పోతున్నాయి.
యూపీఐ సేవల పునరుద్ధరణ విషయమై ఎన్పీసీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దీన్ని త్వరితగతిన పరిష్కరించకుంటే చాలా సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది యూపీఐ డౌన్ అయిందన్న సమాచారం తెలియక పేమెంట్స్ చేస్తున్నారు. ఫలితంగా వేల రూపాయలు పేమెంట్ గేట్ వద్ద ఇరుక్కుపోవడంతో వేల సంఖ్యలో ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. యూపీఐ సర్వీసులు డౌన్ కావడం ఫస్ట్ టేం కాదు. కానీ కీలకమైన టైంలో సర్వర్లు మొరాయిస్తుండటం యూజర్లను చికాకు పెడుతున్నది.
డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ సమాచారం ప్రకారం 60 శాతం మంది యూజర్లు యాప్తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 30 శాతం మంది చెల్లింపుల్లో ఎర్రర్ చూపుతున్నదని పేర్కొంటున్నారు. మరో పది శాతం మంది నగదు బదిలీలో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ, చండీగఢ్ల్లో ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తున్నది.