UPI Services | దేశంలో అనునిత్యం యూపీఐ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఫిన్టెక్ సంస్థలు క్రమంగా తమ ఖాతాదారుల్ని పెంచుకోవడానికి కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తత్ఫలితంగా దేశంలో డీజిటల్ యుపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. కానీ, యూపీఐ లావాదేవీలు చేపట్టాలంటే తొలుత వివిధ బ్యాంకుల యూజర్లు తమ డెబిట్ కార్డు వివరాలు తెలపాల్సిందే. కానీ గ్రామీణులకు డెబిట్ కార్డులు లేవు. ఫలితంగా వారికి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం లేదు.
ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజాగా డెబిట్ కార్డు లేని బ్యాంకుల ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సేవలు పొందొచ్చునని పేర్కొంది. ఇందుకు బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని, డెబిట్ కార్డు పని చేయని ఖాతాదారులు యూపీఐ సేవలు పొందొచ్చునని వివరించింది. బ్యాంకు ఖాతాదారుడు.. తన ఖాతాకు, ఆధార్ నంబర్కు అనుసంధానించిన మొబైల్ నంబర్ ఒక్కటే కావాలని స్పష్టం చేసింది.
తొలుత గతేడాది సెప్టెంబర్లో ఎన్పీసీఐ ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం గత డిసెంబర్ 15 నుంచి అమలు చేయాలని ఆదేశించింది. తర్వాత గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. అయితే, యూపీఐ సేవలను డెబిట్ కార్డు లేని యూజర్లకు అందుబాటులోకి తేవడానికి 9-12 నెలల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్పారు.