UPI Payments | ప్రస్తుతం భారత్లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని వరల్డ్ లైన్ ఇండియా తెలిపింది. వాటిల్లో ఎక్కువగా క్యూఆర్ కోడ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) చెల్లింపులే ఎక్కువని పేర్కొంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో యూపీఐ చెల్లింపులు 103 శాతం పెరిగాయని ఇండియా డిజిటల్ పేమెంట్స్ క్యూ3 రిపోర్ట్ -2021 నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 100 శాతం పెరుగుదలని వివరించింది. మొత్తం 2021 మూడో త్రైమాసికంలో 360 కోట్ల లావాదేవీల్లో రూ.771 వేల కోట్ల చెల్లింపులు జరిగాయి.
ఈ పేమెంట్స్లో పర్సన్ టు పర్సన్ చెల్లింపులు 54 శాతం, వాణిజ్యపరమైన పేమెంట్స్ 46 శాతం పెరిగాయి. 30కి పైగా బ్యాంకులు తమ ఖాతాదారులకు యూపీఐ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో యూపీఐ సేవలందిస్తున్న బ్యాంకుల సంఖ్య 259కి చేరింది. క్రమంగా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ పెరుగుతాయని వివరించింది. ఈ ఏడాది జనవరిలో 47.1 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) ట్రాన్సాక్షన్స్ జరిగితే, సెప్టెంబర్కల్లా 49.7 లక్షలకు చేరుకుంది. పీవోఎస్ పేమెంట్స్లో ప్రైవేట్ బ్యాంకులు 67 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 26 శాతం, పేమెంట్స్ బ్యాంకులు 6 శాతం, విదేశీ బ్యాంకులు ఒకశాతం వాటా కలిగి ఉన్నాయి.