Food Processing | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐటీతోపాటు ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్ తదితర పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ఇప్పుడు ఆహార శుద్ధి రంగంలోనూ జోరుగా పరుగులు తీస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దేశీయ ఆహారశుద్ధి రంగంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఐటీసీతోపాటు ప్రఖ్యాత ఐస్క్రీమ్ తయారీ సంస్థ హాట్సన్, ఫ్రాన్స్కు చెందిన ఫ్లేవర్స్ అండ్ బేవరేజెస్, జార్జెస్ మోనిన్ సాస్, ఆర్పీ గొయంకా గ్రూప్, ప్లాంట్ లిపిడ్స్, కోకకోలా తదితర పలు సంస్థలు ఇప్పటికే మన రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన ఆక్వాహబ్ ద్వారా త్వరలో అమెరికా సహా పలు దేశాలకు చేపలు, మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. ఈ ఆక్వాహబ్లో ఇప్పటికే మూడు ప్రైవేటు కంపెనీలు రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ప్రముఖ బహుళజాతి సంస్థ లులూ గ్రూప్ సైతం మన రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలే ఇందుకు కారణం.
ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈలు
ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో జరిగిన ఫుడ్ కాంక్లేవ్లో తెలంగాణకు 28 సంస్థలు దాదాపు రూ.7,218 కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి. తద్వారా దాదాపు 58 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో పలు కంపెనీలు త్వరలో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో వరి దిగుబడులు ఏటేటా గణనీయంగా పెరుగుతుండటంతో వాటి ద్వారా వివిధ ఆహార ఉత్పత్తులను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా అత్యాధునిక రైస్ మిల్లులు, వేర్హౌస్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. భారీ ఆహార పరిశ్రమలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఏర్పాటు చేయించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఎస్హెచ్జీలకు తగిన తర్ఫీదును ఇప్పించడంతోపాటు తనఖా లేకుండా నామమాత్రపు వడ్డీతో రుణాలను, యంత్రసామాగ్రిని అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.8.43 కోట్లతో హైదరాబాద్లో మిల్లెట్స్, వరంగల్ (రూరల్)లో స్పైసెస్, జగిత్యాలలో మ్యాంగో ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తున్నది.
l 6,800 కోట్ల పెట్టుబడులు, 80 వేల ఉద్యోగాలు
ఆహారశుద్ధి రంగంలో రాష్ర్టానికి 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 6,864 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిద్వారా 3,800 యూనిట్లు ఏర్పాటవడంతో దాదాపు 80 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, జనగామ, నిజామాబాద్, వరంగల్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, నాగర్కర్నూల్ తదితర 17 జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే 3,888.76 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించారు. త్వరలో నిర్మల్, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్ (రూరల్) తదితర జిల్లాలో మరో 3,261.18 ఎకరాల భూమిని అప్పగించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఈ ఏడాది మార్చి చివరినాటికి 77 కంపెనీలకు 351 ఎకరాలు కేటాయించారు. త్వరలో మరో 803 కంపెనీలకు భూములను కేటాయించనున్నారు.