న్యూఢిల్లీ, ఆగస్టు 23: రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కోసం వచ్చే నెల క్యాపిటల్ మార్కెట్లలోకి వెళ్లనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్విట్స్) ద్వారా నిధులను సమీకరిస్తామని మంగళవారం ఇక్కడ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి తెలిపారు. కాగా, మొత్తం నాలుగు రోడ్డు ప్రాజెక్టుల కోసం ఈ నిధులను మోదీ సర్కారు సేకరించనున్నది. ఇక ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ పెట్టుబడుల పరిమితి రూ.10 లక్షలుగా ఉంటుందని గడ్కరీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పెట్టుబడిపై కనీసం 7-8 శాతం ప్రతిఫలం ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే మళ్లీ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) విధానం కింద ప్రాజెక్టులను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెరవనున్నదన్నారు. 2024కల్లా జాతీయ రహదారుల పొడవును 2 లక్షల కిలోమీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. 2021 నవంబర్ నాటికి దాదాపు 1.41 లక్షల కిలోమీటర్లుగా ఉన్నాయన్నారు.
పెట్రోల్, డీజిల్కు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలను తేవాలన్న లక్ష్యాన్ని గడ్కరీ పునరుద్ఘాటించారు. పర్యావరణహిత ఇంధనాలతో వాహనాలు పరుగులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా, రోడ్డు నిర్మాణం, నదుల అనుసంధానం, పొడి-తడి చెత్త నిర్వహణ, పార్కింగ్ ప్లాజా, నీటి పారుదల, రోప్వేలు, కేబుల్ కార్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు దేశంలో అపార అవకాశాలున్నాయన్నారు. నాణ్యతలో రాజీపడకుండా తక్కువ ఖర్చుతో నిర్మాణాలను చేపట్టే టెక్నాలజీలపై దృష్టి పెట్టాలన్న గడ్కరీ.. ప్రస్తుత సిమెంట్, ఇతరత్రా ముడి సరుకులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి ఢిల్లీకి ప్రయాణీకులు 12 గంటల్లో చేరుకోవాలన్నదే తన కల అన్నారు.