RBL Bank MD on Leave | ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ.. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్స్ జారీ చేయడానికి వీలుగా చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కొల్హాపూర్ కేంద్రంగా పని చేస్తున్న రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (ఆర్బీఎల్) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ బ్యాంకుకు ప్రత్యేక డైరెక్టర్గా యోగేశ్ కే దయాల్ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమించింది. బ్యాంకు మేనేజ్మెంట్లోనూ సెంట్రల్ బ్యాంకు మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఆర్బీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో విశ్వవిర్ అహుజా గత రాత్రి సెలవుపై వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కొన్నేండ్లుగా ఆర్బీఎల్ రుణాలు రెట్టింపవుతూ వచ్చాయి. 2017లో రూ.29 వేల కోట్లు ఉన్న రుణాలు ఇప్పుడు రూ.58 వేల కోట్లు దాటాయి. స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ).. 2017లో రూ.357కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.2,600 కోట్లు దాటాయి. బ్యాంకు నిర్వహణ లాభాలు పెరుగుతున్నాయి. కానీ వాటితో మొండి బకాయిలను సర్దుబాటు చేస్తున్నది. ఆర్బీఎల్ నికర లాభం చాలా తక్కువ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆందోళన వ్యక్తం చేశారు.
బలహీన ఆర్థిక పరిస్థితుల మధ్య రిటైల్ రుణాలు, మైక్రో ఫైనాన్సింగ్, క్రెడిట్ కార్డుల బిజినెస్లో అడుగు పెట్టి చేతులు కాల్చుకున్నదని నివేదికలు వచ్చాయని ఏఐబీఈఏ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్బీఎల్ను ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయాలని సీహెచ్ వెంకటాచలం కోరారు.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. యెస్ బ్యాంకు, గతేడాది లక్ష్మి వికాస్ బ్యాంకుల్లో మాదిరిగా ఆర్బీఎల్లోనూ చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా పరిస్థితులపై ఆర్బీఎల్ బ్యాంక్ స్పందించింది. బ్యాంకు పరిస్థితి బేష్షుగ్గా ఉందని పేర్కొంది. బ్యాంకు సంపాదించిన ఆదాయం.. అందుకు తాము అమలు చేస్తున్న బిజినెస్ ప్లాన్, వ్యూహాన్ని గత అక్టోబర్ 28న ఇన్వెస్టర్లకు తెలియజేశామని గుర్తు చేసింది. కరోనాతో సవాళ్లు తలెత్తాయని.. ప్రస్తుతం పరిస్థితి మెరుగు పడుతున్నదని పేర్కొన్నది.