Nirmala Sitaraman | రోజురోజుకు దేశంలో ఆదాయం పన్ను చెల్లించే సామర్థ్యం గల కార్మికులు, ఉద్యోగులు పెరుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి దాదాపు ఏడు కోట్ల మంది ఐటీఆర్లు దాఖలు చేశారని.. 2047 నాటికి 48.2 కోట్లకు చేరుతుందన్నారు. 2047 దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు అవుతుంది. మంగళవారం జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్-2023లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రస్తుతం మొత్తం కార్మికులు, ఉద్యోగ వర్గాల్లో 22.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లించగలుగుతున్నారని, వచ్చే 24 ఏండ్లలో అది 85.3 శాతానికి పెరుగుతుందన్నారు. ఇది దేశ ఎకానమీ గ్రోత్కు నిదర్శనం అని చెప్పారు.
ప్రతి ఐటీ శ్లాబ్ పరిధిలోనూ టాక్స్ ఫైలింగ్స్ మూడు రెట్లు పెరిగిందని నిర్మలా సీతారామన్ వివరించారు. అన్ని టాక్స్ శ్లాబ్ల పరిధిలో నాలుగు రెట్ల వరకు పెరిగినట్లు కనిపిస్తున్నదన్నారు. రాష్ట్రాల వారీగా ఐటీఆర్ ఫైలింగ్లో మహారాష్ట్ర లీడర్గా కొనసాగుతున్నదని చెప్పారు. గత నాలుగేండ్లలో డీమ్యాట్ ఖాతాలు రెండింతలకు పైగా పెరిగాయని తెలిపారు. 2019లో 4.1 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాలు 2022-23 నాటికి 10 కోట్లకు చేరాయన్నారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు ప్రపంచీకరణ ఉపయోగపడిందన్నారు. పలు దేశాలు డిజిటల్ అక్షరాస్యతో వెనుకబడి ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ ఈ విషయంలో ముందడుగు వేసిందన్నారు. గ్రామాల స్థాయికి డిజిటల్ అక్షరాస్యత పెరిగిందని చెప్పారు.