హైదరాబాద్, నవంబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,510 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ). క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.533.82 కోట్ల లాభంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.20,182.62 కోట్ల నుంచి రూ. 20,683.95 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.4,242.45 కోట్ల నుంచి రూ.3,723.76 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 14.71 శాతం(రూ.95,796.90 కోట్లు) నుంచి 12.64 శాతం(80,211.73 కోట్లకు) తగ్గాయి. కానీ, నికర ఎన్పీఏ మాత్రం 4.13 శాతం(రూ.23,894.35 కోట్లు) నుంచి 4.61 శాతానికి(రూ.26,786.42 కోట్లకు) పెరిగాయి. ఏకీకృత విషయానికి వస్తే రూ.21,621.87 కోట్ల ఆదాయంపై రూ.1,510.68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ షేరు ధర 5.89 శాతం ఎగబాకి రూ.49.40 వద్ద నిలిచింది.