న్యూఢిల్లీ, నవంబర్ 30: ఆదిత్యా బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ బీకే బిర్లా గ్రూప్నకు చెందిన కేశోరాం ఇండస్ట్రీస్ సిమెంట్ వ్యాపారాన్ని చేజిక్కించుకోనుంది. టైర్లు, రేయాన్, కెమికల్స్ తదితర వ్యాపారాల్ని నిర్వహిస్తున్న కేశోరాం ఇండస్ట్రీస్ తన సిమెంట్ విభాగాన్ని వేరుపర్చి అల్ట్రాటెక్కు విక్రయిస్తున్నది. ఈ సిమెంట్ వ్యాపారానికి ఉన్న రుణంతో సహా రూ. 7,600 కోట్ల విలువను నిర్దేశిస్తూ ఆల్-షేర్ డీల్గా ఈ టేకోవర్ జరుగుతుంది. కేశోరాం షేర్హోల్డర్లకు ప్రతీ 52 షేర్లకు ఒక అల్ట్రాటెక్ షేరును కేటాయిస్తారు. ఈ డీల్ బిర్లా కుటుంబంలోనే జరగడం గమనార్హం. బీకే బిర్లాకు ఆదిత్యా బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా మనుమడు. అలాగే కేశోరాం ఇండస్ట్రీస్లో కుమార మంగళం బిర్లాకు పరోక్ష పెట్టుబడులు సైతం ఉన్నాయి. ప్రస్తుతం కేశోరాం ఇండస్ట్రీస్కు బీకే బిర్లా కుమార్తె మంజుశ్రీ ఖైతాన్ నేతృత్వం వహిస్తున్నారు.
కేశోరాం సిమెంట్కు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని బసంత్నగర్, కర్ణాటకలోని సేదాంల్లో రెండు సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి స్థాపక వార్షిక ఉత్పాదక సామర్థ్యం 10.75 మిలియన్ టన్నులు. వీటితో పాటు మహారాష్ట్రలో 0.66 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ప్యాకింగ్ ప్లాంటు కూడా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేశోరాం సిమెంట్ వ్యాపారం రూ. 3,534 కోట్ల టర్నోవర్ సాధించింది. కేశోరాంకు 18-20 శాతం అధిక వడ్డీతో కూడిన రూ. 1,700 కోట్ల రుణాన్ని తగ్గించుకోవడానికి యాజమాన్యం తాజా మూలధనాన్ని సమకూర్చుకోవడంలో విఫలమవుతున్నది. తాజా విక్రయంతో రూ. 1,700 కోట్ల రుణ మొత్తాన్ని సిమెంట్ వ్యాపారంతో పాటు అల్ట్రాటెక్కు బదిలీ అవుతుందని కేశోరాం అధికారి ఒకరు తెలిపారు. ఇక ప్రపంచంలో మూడవ పెద్ద సిమెంట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్కు 137.85 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విస్తరణ ప్రాజెక్టులతో ఈ సామర్థ్యం 160 మిలియన్ టన్నులకు చేరుతుంది. కేశోరాం ప్లాంట్లను టేకోవర్ చేయడంతో వేగంగా వృద్ధిచెందుతున్న దక్షిణాది, పశ్చిమ మార్కెట్లలో విస్తరించే అవకాశం లభిస్తుందని అల్ట్రాటెక్ ప్రకటన తెలిపింది. వివిధ రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఈ డీల్ 9-12 నెలల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.