UBI | న్యూఢిల్లీ, జూలై 20: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,236 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,558 కోట్ల లాభంతో పోలిస్తే 100 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం వల్లనే లాభాలు రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.20,991 కోట్ల నుంచి రూ.27,381 కోట్లకు ఎగబాకింది. వీటిలో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.18,174 కోట్ల నుంచి రూ.23,478 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం 10.22 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 7.34 శాతానికి దిగొచ్చింది. అలాగే నికర ఎన్పీఏ కూడా 3.31 శాతం నుంచి 1.58 శాతానికి తగ్గింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,984 కోట్ల నిధులను వెచ్చించింది.