హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్, తెలంగాణలోని వరంగల్లో తన సేవలను ప్రారంభించింది. దీంతో దేశంలో వందో నగరానికి కంపెనీ సేవలను విస్తరించింది. వరంగల్లో తొలుత ఆటో, కార్ బుక్కింగ్ను అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఈ మైలురాయి సాధించిన ఉబర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. వరంగల్ నివాసితుల కోసం క్లిష్టమైన రైడ్షేరింగ్ సేవను ప్రారంభించినందుకు ఉబర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఈజీ, స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్రంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు అర్బన్ నగరాలైన కాజీపేట, హన్మకొండ, వరంగల్ మధ్య సమర్థవంతమైన కనెక్టివిటీని పెంచడంలో ప్రభుత్వ, ప్రైవేట్ సహకారాలు చాలా దోహదపడతాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయానికి తొలి, చివరి మైలు కనెక్టివిటీని అందిస్తుందన్నారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏండ్లుగా మిలియన్ల కొద్దీ రైడర్లు, వ్యాపారాలు, డ్రైవర్లు, కొరియర్లను ఉబర్ కనెక్ట్ చేసిందని ఉబెర్ ఇండియా, సౌత్ ఏషియా సిటీస్ ఆపరేషన్స్ హెడ్ శివ శైలేంద్రన్ తెలిపారు. మరెవరూ లేని స్థాయిలో బిలియన్ల కొద్దీ రైడ్లు, డెలివరీలను అందించడం ద్వారా ప్రపంచ గతిశక్తిని ఉబర్ మార్చిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో మరెన్నో మైలురాళ్లను చేరుకునేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు.
2013లో దేశంలో ఉబర్ సేవలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 95 మిలియన్ల మంది రైడర్లు, డ్రైవర్లకు సేవలందించింది. రెంటల్స్, ఉబర్కనెక్ట్, ఆటో, మోటో సౌకర్యాలు, డ్రైవర్ టిప్పింగ్, సేఫ్టీ హెల్ప్లైన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఉబర్ కంపెనీ ఇప్పుడు తన ఉనికిని 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.