న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. దేశంలో అతిపెద్ద గృహ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్లు తమ గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం వరకు పెంచాయి. దీంతో గృహ రుణాలు తీసుకున్నవారిపై మరింత ఆర్థిక భారం పడనున్నది. నూతనంగా రుణాలు తీసుకునేవారు, గతంలో తీసుకున్నవారు తమ ఈఎంఐలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నట్లు పేర్కొంది. హెచ్డీఎఫ్సీ..రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణరేటు 9.20 శాతానికి చేరుకున్నది. అలాగే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది పీఎన్బీ. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.4 శాతం నుంచి 8.5 శాతానికి సవరించినట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు, రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఆర్పీఎల్ఆర్)ని పావు శాతం సవరించింది హెచ్డీఎఫ్సీ. అలాగే సిబిల్ స్కోర్ 760 అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 8.70 శాతం వడ్డీకే రుణం అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.