Twitter : కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోండి లేదా రాజానామా చేయండి అని ఈమధ్యే ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు చెప్పిన విషయం తెలిసిందే. దాంతో, మస్క్ ధోరణి నచ్చక చాలామంది రాజీనామా చేస్తున్నారు. తాజాగా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లోని ట్విట్టర్ ఆఫీసులో పనిచేస్తున్న చివరి ఇద్దరు ఉద్యోగులు కంపెనీని వీడారని అమెరికాకు చెందిన బ్లూమ్బర్గ్ న్యూస్ ఛానెల్ తెలిపింది. సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్స్ పోస్ట్లో ఉన్న జులియా మోజర్, డరియో లా నాసా పోయిన వారం ట్విట్టర్కు గుడ్ బై చెప్పారు. దాంతో బ్రస్సెల్స్లో ట్విట్టర్ ఆఫీస్ మూతపడింది.
ఎలన్మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసే సమయంలోనే సగానికిపై ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం జరిగింది. సరిగ్గా ఆ టైంలోనే బ్రస్సెల్స్ ట్విట్టర్ ఆఫీస్లో ఆరుగురు ఉద్యోగులను నియమించారు. అయితే వాళ్లలో నలుగురు కొన్ని రోజుల కిందే రాజీనామా చేశారు. వాళ్ల ప్లేస్లో కొత్తవాళ్లను తీసుకోలేదు. దాంతో, అప్పటినుంచి జులియా మోజర్, డరియో లా నాసా మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా కిందటి వారం ట్విట్టర్ నుంచి బయటకు వచ్చారు. యూరప్ దేశాల నుంచి వెలువడే ట్వీట్లను నియంత్రించేందుకు బ్రస్సెల్స్ ట్విట్టర్ ఆఫీస్ చాలా కీలకమైనది. ఇప్పటికే ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించింది.