న్యూయార్క్ : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెంట్ చెల్లించేందుకు ఎలన్ మస్క్ (Elon Musk) నిరాకరించడంతో కీలక ఆఫీసుల్లో ఒకదాన్ని ట్విట్టర్ కోల్పోయింది. రెంట్ చెల్లించడంలో విఫలం కావడంతో బౌల్డర్ కార్యాలయాన్ని ట్విట్టర్ ఖాళీ చేయాలని కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ స్పష్టం చేశారు. భవన యజమానిని సవాల్ చేస్తూ మేలో ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది.
2020 ఫిబ్రవరిలో ఇరు పార్టీల మధ్య లీజు ఒప్పందం జరగ్గా రెంట్ చెల్లింపు నిబంధనలను అనుసరించడంలో ట్విట్టర్ విఫలమైంది. కార్యాలయ రెంట్ బకాయిలు, న్యాయవాదుల ఫీజు, వ్యయాలను చెల్లించడంతో పాటు భవనాన్ని తిరిగి తన అధీనంలోకి అప్పగించాలని భవన యజమాని న్యాయస్ధానాన్ని అభ్యర్ధించాడు. మరోవైపు తమ సేవలకు పీజులు చెల్లించలేదని బౌల్డర్ అవలాంచె కమర్షియల్ క్లీనింగ్ కూడా ట్విట్టర్పై దావా వేసింది.
తమకు ట్విట్టర్ దాదాపు లక్ష డాలర్లు చెల్లించాలని కంపెనీ పేర్కొంది. ఇక బౌల్డర్ బిల్డింగ్లో ట్విట్టర్లో 300 మంది పనిచేస్తుండగా కంపెనీలో సగానికి పైగా సిబ్బందిని మస్క్ తొలగించడంతో ఈ బిల్డింగ్లో ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. కొలరాడో కార్మిక, ఉపాధి శాఖ వివరాల ప్రకారం బౌల్డర్ కార్యాలయంలో 87 మంది ఉద్యోగులను ట్విట్టర్ తొలగించగా 38 మంది వారంతట వారే గత ఏడాది నవంబర్లో రాజీనామా చేశారని తెలిసింది.
Read More :
Google | మేం స్కూల్ పిల్లలం కాదు : గూగుల్పై ఉద్యోగుల అసహనం