న్యూయార్క్ : ఎలన్ మస్క్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన అనంతరం కంపెనీలో ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగిస్తున్న నేపధ్యంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ఫౌండర్ జాక్ డోర్సీ జాబ్ కోల్పోయిన సిబ్బందికి క్షమాపణ చెప్పాడు. చాలా మంది తనపై కోపంగా ఉన్నారని తనకు తెలుసని, ఈ క్షణంలో కంపెనీలో నెలకొన్న పరిస్ధితులన్నింటికీ తనదే బాధ్యతని పేర్కొన్నారు.
ట్విట్టర్లో పనిచేసిన వారందరి ప్రేమ, ఆప్యాయతలు ఎనలేనివని డోర్సీ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో పనిచేసే వారంతా అప్పటికీ, ఇప్పటికీ మనోధైర్యంతో, దృఢంగా ఉన్నారని, ఎలాంటి సంక్లిష్ట స్ధితిలోనూ వారు సరైన దిశగా పయనిస్తారని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేసిన అనంతరం సీఈఓ పరాగ్ అగర్వాల్, ఉన్నతోద్యోగి విజయ గద్దె సహా దాదాపు 3500 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే.