Twiiter CEO | తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన ప్రతి ఒక్కరి ఆనందం మాటల్లో చెప్పలేం. దాంతోపాటు తన బిడ్డకు జన్మనిచ్చిన జీవిత భాగస్వామికి రిలీఫ్ కోసం పితృత్వ సెలవులు అందుబాటులోకి వచ్చాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యారు. కానీ కొన్ని వారాలు మాత్రమే పితృత్వ సెలవులు తీసుకుంటామని ఇటీవల ప్రకటించారు. ఇంతకుముందు పితృత్వ సెలవులు తీసుకునే టాప్ ఎగ్జిక్యూటివ్లను అభినందించే పరాగ్ అగర్వాల్.. తాను మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అమెరికా చట్టం ప్రకారం తండ్రయ్యాక ప్రతి ఒక్కరూ పితృత్వ సెలవులు తీసుకోవడం తప్పనిసరి. కానీ 20 వారాల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చునని ట్విట్టర్ యాజమాన్యం ఆఫర్ చేసినా పరాగ్ అగర్వాల్ తద్భిన్నంగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రెడ్డిట్ ఇంక్ సహ-వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఓహానియన్ `మీకు అవసరమైనంత టైం తీసుకొండి` అని కోరారు. తొలి నుంచి అలెక్సిస్ ఓహానియన్ నిత్యం పేరెంటల్ లీవ్ను ప్రోత్సహిస్తుంటారు. ఒహానియన్ తన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్లో ఉద్యోగులకు నాలుగు నెలల పితృత్వ సెలవులను ఆఫర్ చేస్తున్నారు. పరాగ్ అగర్వాల్ పితృత్వ సెలవులు తీసుకోవడం వల్ల సిబ్బందిలో విశ్వాసం పెంచవచ్చని ఇతరులు పేర్కొన్నారు.
గత నవంబర్లో ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్ డోర్సీ వారసుడిగా సీఈవోగా అప్పటి టెక్నాలజీ చీఫ్ పరాగ్ అగర్వాల్ను సంస్థ యాజమాన్యం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పితృత్వ సెలవుపై ట్విట్టర్ అధికార ప్రతినిధి లౌరా యాగర్మన్ స్పందిస్తూ.. పరాగ్ అగర్వాల్ సెలవులో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ టీంతో అనుసంధానం కావడానికి ప్లాన్ వేసుకున్నారు. దీనివల్ల ఆయనకు, ఆయన భార్యకు, కంపెనీకి మంచి జరుగాలి అని అన్నారు. ట్విట్టర్ తమ ఉద్యోగులు ఎల్లవేళలా పితృత్వ సెలవులు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.
కాలిఫోర్నియా చట్టం ప్రకారం ఆ రాష్ట్ర పరిధిలోని ప్రతి సంస్థ ఉద్యోగికి నాలుగు వారాల అన్పెయిడ్ పితృత్వ సెలవు ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలు ఆరు వారాల పెయిడ్ లీవ్ మంజూరు చేయాలి. జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక 12 వారాల పెయిడ్ లీవ్ అనే ప్రతిపాదన తీసుకొచ్చింది. తర్వాత దాన్ని నాలుగు వారాలకు కుదించేసింది. కానీ, అమెరికాలో 23 శాతం మంది ఉద్యోగులు మాత్రమే పితృత్వ సెలవులు వాడుకుంటున్నారు. ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తండ్రయినా.. పిల్లలను దత్తత తీసుకున్నా 10 రోజుల్లోపే పితృత్వ సెలవులు వాడుకుంటున్నారు.