న్యూఢిల్లీ : భారత్ లో వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడించింది. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టే పరిస్థితిలో ఉండవని, ఇక సంపన్న రాష్ట్రాలు గ్లోబల్ మార్కెట్ లో అధిక ధరల్లో వ్యాక్సిన్ల కోసం వెచ్చించాల్సి వస్తుందని ఈ నివేదికలో ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సమకూరుస్తుందని అంచనా వేస్తూ సిక్కిం ఒక్కో వ్యాక్సిన్ కు 5 డాలర్లు ఖర్చు చేసినా రూ 20 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని నివేదిక వివరించింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ వ్యాక్సినేషన్ పై రూ 67,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రజలకు త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్లను సమీకరించాలని నివేదిక సూచించింది. రాష్ట్రాల వ్యాక్సినేషన్ వ్యయం ఒకే విధంగా ఉండేందుకూ ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్ సరఫరాదారులతో సభ్యదేశాల తరపున సంయుక్త ప్రతినిధుల టీం సంప్రదింపులు జరిపిన ఐరోపా సమాఖ్య తరహాను కేంద్రం అనుసరించాలని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది.