హైదరాబాద్, సెప్టెంబర్ 6: హైదరాబాదీ ఔషధ రంగ సంస్థ హెటిరో తయారు చేసిన బయోసిమిలర్ వెర్షన్ టోసిలిజుమబ్ మందును కరోనా చికిత్సలో అత్యవసర వినియోగార్థం వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం హెటిరో తెలియజేసింది. కొవిడ్తో దవాఖానలో చేరిన పెద్దలకు ఈ ఔషధాన్ని ఇవ్వచ్చని డీసీజీఐ స్పష్టం చేసింది. కాగా, ఈ మందును ‘టోసిరా’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అమ్మకాలు జరుపుతామని ఈ సందర్భంగా హెటిరో ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా హెటిరో హెల్త్కేర్ ఈ మందును మార్కెటింగ్ చేస్తుంది. ‘అంతర్జాతీయంగా టోసిలిజుమబ్ కొరత ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్లో సరఫరాకు డీసీజీఐ ఇచ్చిన ఈ అనుమతి ఇప్పుడు అత్యంత కీలకమైనదనే చెప్పాలి. ఈ ఔషధం పంపిణీ పారదర్శకంగా, సజావుగా సాగేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’ అని హెటిరో గ్రూప్ చైర్మన్ బీ పార్థసారధి రెడ్డి చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల ప్లాంట్లో ఈ ఔషధాన్ని హెటిరో ఉత్పత్తి చేయనుండగా, ఈ నెలాఖరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.