MF Investments | ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాల్లో తమ డబ్బు మదుపు చేస్తారు. అటువంటి పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఇండ్లు-ఇండ్ల స్థలాలు.. మ్యూచువల్ ఫండ్స్. పిల్లల కెరీర్ సంబంధ అవసరాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు.. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అలా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రీమియం మాదిరిగా నిర్దిష్ట గడువు ప్రకారం నిరంతరం కొంత సొమ్ము మదుపు చేయొచ్చు. ఒకేసారి గరిష్ట మొత్తంలో మదుపు చేయాలంటే భారీగా డబ్బు అవసరం. వ్యాపారులు, కార్పొరేట్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్లు మాత్రమే అలా ఒకేసారి భారీమొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. వేతన జీవులకు మాత్రం నెలవారీ.. త్రైమాసికం వారీగా అంటే నిర్దిష్ట గడువు ప్రకారం నిరంతరం పెట్టుబడి పెట్టడానికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. నిర్దిష్ట పీరియడ్ ప్రకారం మదుపు చేయడానికి కొద్ది మొత్తం వెచ్చిస్తే సరిపోతుంది. నిర్ణీత గడువు ప్రకారం నిధులు మదుపు చేసే విధానాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ – సిప్) అని అంటారు.
మ్యూచువల్ ఫండ్స్లో భారీ మొత్తంలో పెట్టుబడి అంటే కనీసం రూ.5000 మదుపు చేయాలి. ఒక క్రమ పద్ధతి ప్రకారం అంటే.. ప్రీమియం ప్రకారం రూ.500 మదుపుతో ప్రారంభించొచ్చు. కుటుంబ అవసరాలకు పీరియాడికల్గా కొద్ది కొద్దిమొత్తం పెట్టుబడులు పెట్టుకుంటూ వెళితే.. రోజువారీ జీవనానికి వెసులుబాటు లభించడంతోపాటు దీర్ఘకాలిక లక్ష్యాలను అధిగమించడానికి వీలవుతుంది. ప్రతి రోజూ, వారం, నెలవారీగా, త్రైమాసికం వారీగా మదుపు చేయొచ్చు.
ప్రతి ఒక్కరూ తమ వెసులుబాటును బట్టే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి విధానాన్ని ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మదుపు చేస్తున్నప్పుడు.. గడువు దాటకుండా నిధులు డిపాజిట్ చేస్తూ ఉండటం మరిచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే పదేండ్లు అంతకంటే ఎక్కువ గడువు గల స్కీమ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
మీ పని, దానిపై వచ్చే వేతనాన్ని బట్టే పేమెంట్స్ గడువు నిర్ణయించుకోవాలి. రోజువారీ-వారానికోసారి-నెలవారీ-త్రైమాసికం వారీ మదుపును బట్టి వాటిపై రాబడిలో తేడాలు ఉంటాయి. రోజువారీగా ఆదాయం పొందేవారు నెలలో నాలుగుసార్లు నిధులు మదుపు చేయడం వల్ల రోజువారీ కుటుంబ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు రావు. రోజువారీగా పెరిగే ధరలను అంచనా వేసుకుంటూ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తే.. లక్ష్యాల సాధన తేలికవుతుంది.
రిటైర్మెంట్ తర్వాత కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుని.. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంచుకోవాలి. ప్రస్తుతం ఖర్చులు, పెరిగిన ధరలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి తీసుకుని అందుకు తగినట్లు నిధులు మదుపు చేయాలి. చక్రవడ్డీ పొందాలంటే వీలైనంత తక్కువ వయస్సులోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి.
ఉదాహరణకు 40 ఏండ్ల వయస్సు దాటాక మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తే కాంపౌండ్ ఇంటరెస్ట్ రేటు కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా 25 ఏండ్ల వయస్సు నుంచే నెలకు కనీసం రూ.5000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ నాటికి అంటే 60 ఏండ్ల వయస్సు వచ్చేసరికి రూ.3.25 కోట్లు, 40 ఏండ్లకల్లా రూ.25 లక్షలు పొందుతారు. అలా కాకుండా 40 ఏండ్ల నుంచి పెట్టుబడులు మదుపు చేయడం ప్రారంభిస్తే 60 ఏండ్లు దాటే నాటికి రూ.50 లక్షల నిధులు మాత్రమే వస్తాయి.