Budget 2023-24 | గత రెండేండ్లు కరోనా.. ప్రస్తుత ఏడాది ద్రవ్యోల్బణంతో దేశీయ ఎకానమీ అతలాకుతలమైంది. దీనికి తోడు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ చివరి సారి ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రవేశ పెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. కొత్త సర్కార్ ఏర్పాటయ్యే వరకూ అయ్యే ఖర్చుల కోసం ప్రవేశ పెట్టే బడ్జెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్..
అధిక ధరల పోటు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మాంద్యం ముప్పు, ఉద్యోగాల కోత వంటి సవాళ్ల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) వార్షిక బడ్జెట్ సమర్పణకు సమాయాత్తం అవుతున్నారు. గత తొమ్మిదేండ్లుగా మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకునే చర్యలేమీ లేవు. ఎన్నికల ముంగిట మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ మీద భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రజాకర్షక బడ్జెట్ రూపొందించడం నిర్మల’మ్మకు కత్తి మీద సవాలే.. ఆమె సారధ్యంలోని ‘బడ్జెట్ టీం’ ఇందుకోసం భారీగానే కసరత్తు చేస్తోంది. ఆ టీంలో ఎవరెవరు ఉంటారు.. వారి పాత్ర ఏమిటో తెలుసుకుందామా.. !
ప్రధాని నరేంద్రమోదీ 2.0 క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ బుధవారం ఐదో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు నిర్మలమ్మ. తొలుత లండన్ లోని ఓ స్టోర్లో పని చేశారు. తర్వాత యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో వ్యవసాయ ఇంజనీర్ల సంఘం అసోసియేషన్ ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. మోదీ తొలి సర్కార్లో తొలుత ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, తదుపరి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న టీవీ సోమనాథన్ తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ అధికారి. ప్రభుత్వం ప్రకటించే పథకాలకు నిధుల కేటాయింపు, వ్యయం అంచనాలు లెక్కిస్తారు. ఇంతకుముందు కార్పొరేట్ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేసిన సోమనాథన్.. 2015-17 మధ్య ప్రధాని కార్యాలయం (పీఎంవో)లోనూ పని చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రపంచ బ్యాంకులోనూ సేవలందించారు. బడ్జెట్ రూపకల్పన టీంలో అత్యంత సీనియర్ కూడా ఈయనే.
విత్త మంత్రి నిర్మలా సీతారామన్ టీంలో మరో కీలక వ్యక్తి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్. 1987 కర్ణాటక క్యాడర్ అధికారి అయిన అజయ్ సేథ్.. 2021 ఏప్రిల్ 15 నుంచి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో బెంగళూరు మెట్రో ఎండీగానూ పని చేశారు. దేశీయ ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తారు. బడ్జెట్ తయారీకి ఉపయోగించే డేటా మొత్తం అజయ్ సేథ్ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడంలో కీలకంగా వ్యవహరిస్తారు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ‘దీపం’ కార్యదర్శి తుహిన్ కాంత పాండే. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ సంస్థకు విక్రయించడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై దూకుడుగా దూసుకెళ్లిన కేంద్రం.. ఈ దఫా కాస్త జోరు తగ్గిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన సంస్థల్లో వాటాల ఉపసంహరణ మినహా కొత్త వాటిని చేర్చే అవకాశాలు కనిపించడం లేదు.
కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ విభాగం అధికారిగా సంజయ్ మల్హోత్రా.. ప్రభుత్వానికి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ప్రకటనలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇటీవలే ఫైనాన్సియల్ విభాగం నుంచి సంజయ్ మల్హోత్రా.. రెవెన్యూ విభాగానికి మారారు. రెవెన్యూశాఖ కార్యదర్శిగా పన్నుల రాబడిపై అంచనాలు రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తారు.
ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా వివేక్ జోషి 1989 హర్యానా ఐఏఎస్ క్యాడర్ అధికారి. ఆయన ఇంటర్నేషనల్ ఎకనమిక్స్లో ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇటీవలే సంజయ్ మల్హోత్రా స్థానంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా వివేక్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ విభాగం పరిధిలోకి బ్యాంకులు, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ సంస్థలు వస్తాయి. జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం తదితర పథకాలు ఈ విభాగం పరిధిలోకే వస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పన టీంలో మరో కీలకమైన వ్యక్తి అనంత నాగేశ్వరన్. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న అనంత నాగేశ్వరన్ మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఫైనాన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ నెల 31న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వే రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది.