Senior Citizen Savings Scheme | రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజన్లు రెగ్యులర్ ఇన్కం కోసం తరుచుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనే ఆధార పడుతుంటారు. కానీ కరోనా మహమ్మారి తీసుకొచ్చిన విపత్కర పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు వడ్డీరేట్లు తగ్గించేశాయి. ఇటువంటి తరుణంలో సీనియర్ సిటిజన్లకు, ప్రత్యేకించి 60 ఏండ్లు దాటిన వారి కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తీసుకొచ్చిన ఎస్సీఎస్ఎస్తో రిటైర్మెంట్ తీసుకున్న సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్గా ఉంటుంది. కేంద్రీయ బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించేశాయి. కానీ కేంద్రం మద్దతుతో తీసుకొచ్చిన ఎస్సీఎస్ఎస్ కింద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.4 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నాయి.
60 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు అర్హులు. 55 ఏండ్లు దాటిన వారు.. 60 ఏండ్లలోపు గల వారిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్న వారు కూడా ఈ ప్లాన్ కింద ఫిక్సడ్ డిపాజిట్లు చేయొచ్చు. రిటైర్డ్ మిలిటరీ సభ్యులకైతే 50 ఏండ్లు దాటినా వెసులుబాటు కల్పిస్తుందీ పథకం.
ఈ పథకం కింద కనీసం రూ.1000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఎఫ్డీ చేయొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం రూ.1000తో గణించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా వ్యక్తిగత ఖాతాలు గల వారు సీనియర్ సిటిజన్లతో కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం కింద గరిష్ఠంగా 7.4 శాతం వడ్డీరేట్ ఆఫర్ చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి కేంద్ర ఆర్థికశాఖ వడ్డీరేటును సమీక్షిస్తుంది. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి ఒకటో తేదీల్లో సమీక్షిస్తుంది.
ఈ స్కీం ఐదేండ్లకు మెచ్యూర్ అవుతుంది. తర్వాత మరో మూడేండ్లు పొడిగించొచ్చు. ఎస్సీఎస్ఎస్ కింద తెరిచిన ఖాతాను ఏడాది తర్వాత మూసేయొచ్చు. కానీ రెండేండ్ల గడువు ముగియడానికి ముందే క్లోజ్ చేయాలి. అలా చేసినా లభించే ఆదాయంపై 1.5 శాతం డిడక్ట్ చేస్తారు. రెండేండ్ల తర్వాత ఖాతా మూసేస్తే ఒకశాతం పెనాల్టీ విధిస్తారు.