Raptee E-Bike | ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ తయారీ సంస్థ రాప్టీ (Raptee) తన తొలి ఈ-బైక్ ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈవీ స్కూటర్లు, మోటారు సైకిళ్లపై సబ్సిడీ తగ్గించడంతో ప్రధాన ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. సబ్సిడీ తగ్గించడం మంచిదని రాప్టీ భావిస్తున్నది. సబ్సిడీ తగ్గించడం వల్ల మోటారు సైకిల్ లేదా స్కూటర్ క్వాలిటీ పెంచడంతోపాటు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని సేఫ్టీ ఫీచర్లు జత చేయొచ్చునని రాఫ్టీ ఎనర్జీ కో-ఫౌండర్ దినేష్ అర్జున్ చెప్పారు.
రాఫ్టీ తన తొలి ఈ-బైక్ ను వచ్చే ఏప్రిల్-జూన్ మధ్య దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. అయితే ఈ మోటారు సైకిల్ కి పేరు పెట్టలేదు. దీని ధర రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుంది. గత నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’లో ప్రదర్శించిన ఈ ఈ-బైక్ మిడ్ ప్రీమియం సెగ్మెంట్ మోటారు సైకిల్. ఈ మోటారు సైకిల్ తయారు చేయడానికి ఐదేండ్లు పట్టింది. హై ఓల్టేజీ డ్రైవ్ ట్రైన్ బైక్ ఇది. 10-12 ఏండ్ల లైఫ్ సైకిల్ గల ఈ బైక్ పబ్లిక్ చార్జర్ల వద్ద చార్జింగ్ చేసుకోవచ్చు. ఇంటి వద్ద 45 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుందని దినేష్ అర్జున్ తెలిపారు.
రాప్టీ ఈ-బైక్ ఏసీ, డీసీ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది. సీసీఎస్2 కనెక్టర్ ఉచితంగా అందజేస్తుందీ రాప్టీ. వచ్చే ఏడాది 10 వేల మోటారు సైకిళ్లు తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 2025 చివరికల్లా గానీ, తొలి బైక్ ఆవిష్కరించిన తర్వాత 18 నెలలకు గానీ రెండో ఈ-బైక్ ఆవిష్కరించడానికి రాప్టీ ప్రణాళిక రూపొందిస్తున్నది.