న్యూఢిల్లీ, మే 26: వివిధ రకాల వాహనాలకు థర్డ్ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను కేంద్ర రోడ్డు రవాణా శాఖ పెంచేసింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రీమియం రేట్లతో ముఖ్యంగా కార్లు, ద్విచక్రవాహనాలకు బీమా వ్యయం పెరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ సవరించిన రేట్లతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొవిడ్-19 కారణంగా థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్పై రెండేండ్లు మారిటోరియం విధించిన తర్వాత ప్రీమియం రేట్లను ఇప్పుడు సవరించారు. గతంలో టీపీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) నోటీఫై చేసేది. బీమా రెగ్యులేటర్తో సంప్రదించిన మీదట మంత్రిత్వ శాఖ వీటిని నోటిఫై చేయడం ఇదే తొలిసారి.
మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు చెల్లించే ప్రీమియంలో 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 30 కేడబ్ల్యూకు మించని ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు రూ.1,780 ప్రీమియంను నిర్ణయించారు. 30 కేడబ్ల్యూ-65 కేడబ్ల్యూ మధ్యగల కార్ల ప్రీమియం రూ. 2,904. విద్యా సంస్థల బస్సులకు 15 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు నోటీఫై చేశారు.
అలాగే వింటేజ్ కారుకు, రిజిష్టర్ అయ్యే ప్రైవేటు కారుకు ప్రీమియంలో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వాహన యజమాని తీసుకునే సొంత డ్యామేజీ బీమా రక్షణతో పాటు సొంత డ్యామేజీ మినహా ఇతర డ్యామేజీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. థర్డ్ పార్టీ ద్వారా జరిగే డ్యామేజీకే ఇది వర్తిస్తుంది.