Investment Plans | ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువులు.. ఆదాయం ఎక్కువగా ఉంటే సొంతిల్లు.. ఆడపిల్లలు ఉంటే పెండ్లిండ్లు.. అటుపై రిటైర్మెంట్ ఫండ్ సమకూర్చుకోవడం లక్ష్యాలుగా పెట్టుకుంటారు. ఈ లక్ష్యాలన్నీ జీవిత కాలంలో ఒకేసారి అమలు చేయాలంటే అందుకు అనుగుణంగా ప్లాన్లు రూపొందించుకోవాలి. ఆయా లక్ష్యాల సాధనకు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకోవాలి. తదనుగుణంగా పెట్టుబడులు పెట్టుకోవాలి.. అదెలాగో ఓ లుక్కేద్దాం..
ప్రస్తుతం పిల్లల విద్యాభ్యాసం అంటే అంత తేలిక్కాదు. ఇక ఉన్నత విద్యా కోర్సులంటే ఖర్చు అంచనా వేయడం కష్టమే. ఇందుకు ముందస్తు ప్లాన్ చాలా చాలా అవసరం. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ జీవనానికి రిటైర్మెంట్ ఫండ్ ఎంత కీలకం అన్న సంగతి కుటుంబ యజమానిపై ఆధార పడే వారికి తెలుస్తుంది. ఫైనాన్సియల్ ప్లాన్ అమలు చేస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మొత్తం ప్లాన్ అమలే ప్రమాదంలో పడుతుంది. పిల్లల చదువులు, రిటైర్మెంట్ ఫండ్ వంటి లక్ష్యాల సాధనకు దీర్ఘకాలికంగా ఎలాంటి తప్పులు చేయకూడదని ఆర్థిక వేత్తలు చెబుతుంటారు.
పిల్లల విద్యాభ్యాసం, రిటైర్మెంట్ ఫండ్ లక్ష్యాల సాధనకు ముఖ్యాంశాలు తెలుసుకోవడంతోపాటు అమలు చేయాలి. పిల్లల విద్యాభ్యాసం, రిటైర్మెంట్ మధ్య 10-15 ఏండ్ల తేడా ఉంటది. 40-50 ఏండ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు పిల్లల ఉన్నత విద్యావసరాలకు మనీ అవసరం. సాధారణంగా 60 ఏండ్లకు రిటైర్మెంట్ పూర్తవుతుంది. ఈ లక్ష్యాల సాధనకు ఏ సమయంలో మదుపు ప్రారంభించారన్నదాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ వంటి సంప్రదాయ పెట్టుబడి స్కీంల్లో పెట్టుబడులు పెడతారు. విద్యాభ్యాసం, రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాల అవసరాలతో ముడి పడి ఉంటాయి. సంప్రదాయ పెట్టుబడి పథకాల్లో మదుపుతో రిస్క్ ఉండకపోయినా.. పెద్దగా రిటర్న్స్ ఉండవు. కనుక అవసరాలకు అనుగుణంగా విభిన్నంగా పెట్టుబడులు పెట్టడం దిశగా ఆలోచించాలి. దీర్ఘకాలిక అవసరాలకు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ సరైనవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పిల్లల విద్య, రిటైర్మెంట్ ఫండ్ .. ప్రతి ఒక్కరి జీవితంలో వేర్వేరు దశల్లో వస్తాయి. అందుకు అనుగుణంగానే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఉండాలి. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ లో ఇన్వెస్ట్ మెంట్ వల్ల పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ వయస్సును బట్టి డెట్ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైర్మెంట్ కంటే ముందు పిల్లల విద్యావసరాలు వస్తాయి. కనుక రిస్క్ తక్కువగా ఉండే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం.
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే .. అవసరాలను అంచనా వేసి మూడేండ్ల ముందే ఆయా ఫండ్స్ నుంచి నిధులు విత్ డ్రా చేసి ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పొదుపు చేయాలి. 15 ఏండ్ల సమయం ఉంటే పీపీఎఫ్ వంటి పథకాల్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు.
కొన్ని సందర్భాల్లో పిల్లల అవసరాలకు సరిపడా నిధులు సమకూరకపోతే విద్యా రుణం తీసుకోవడం.. ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు. మరోవైపు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.