బంగారంతో భారతీయులకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సంపదగానేగాక గౌరవం, హోదాగానూ భావిస్తారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో గోల్డ్కు అంత డిమాండ్. దీనికి తగ్గట్టుగానే ఏటా దేశంలోకి 650-1,000 టన్నులు దిగుమతి అవుతున్నది. అయితే ఇందుకు డాలర్ల రూపంలో చెల్లించాల్సి వస్తున్నది. ఇది దేశంలో విదేశీ మారకపు నిల్వలను పడిపోయేలా చేస్తున్నది. 2015లో 34.32 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2024లో 45.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2019లో పసిడి దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.88 శాతానికి పెంచారు. 2022లో 15 శాతానికి తీసుకెళ్లారు. అయితే దిగుమతులు తగ్గినా స్మగ్లింగ్ పెరిగిపోయింది. వీటన్నింటి నేపథ్యంలోనే గత పదేండ్లుగా గోల్డ్ బాండ్లను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తున్నది. భౌతిక బంగారాన్ని కొనే బదులు.. బాండ్లను కొనండంటూ ప్రచారం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అంతకంతకూ ఆసక్తి చూపుతూ వచ్చారు. కానీ పెరుగుతున్న ధరలు.. ఈ బాండ్లను ప్రభుత్వానికి భారంగానే తయారుచేశాయి. నిజానికి ధరలు ఇంతలా పెరుగుతాయని ఊహించని కేంద్రం.. వీటిపై కేవలం 2.5 శాతం వడ్డీనే కాబట్టి రేట్లు ఎంత పెరిగినా లాభమేనని ఊహించింది. కానీ సీన్ రివర్సైంది.