న్యూఢిల్లీ, ఆగస్టు 27: దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. వచ్చే నాలుగేండ్లకాలంలో డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు పెరిగి 5 నుంచి 6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.65 గిగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లు నిర్వహిస్తున్నారు.
డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ చట్టం సూచనమేరకు డాటాను స్థానికంగా నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నదని, అలాగే రిజర్వుబ్యాంక్, ఐఆర్డీఏఐల నుంచి ఆదేశాలు జారీ కావడంతో డాటా వినిమయం ఊపందుకున్నదని, వీటికి తోడు దేశంలో మెగావాట్కు సుమారు 8 మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చు కావడంతో ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. 2025 క్యాలెండర్ ఏడాది చివరి నాటికి 1.65 మెగావాట్లుగా ఉన్న డాటా సెంటర్ల కెపాసిటీ 2030 నాటికి 5-6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.