హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లాలో రూ.1,200 కోట్ల పెట్టుబడితో థెరానిమ్ బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పరిశోధన దశ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ దాకా అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే చోట కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్’ను అభివృద్ధి చేసేలా సమగ్ర కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫార్మా రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ను బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
రాబోయే రోజుల్లో బయోటెక్నాలజీ రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ జెనెటిక్స్ వంటి సాంకేతికతలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఫలితంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూనే.. తలెత్తే సవాళ్లను అధిగమించేలా.. దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామని వివరించారు. లైఫ్ సైన్సెస్ పాలసీ, వన్ బయో హబ్, గ్రీన్ ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ తదితర విప్లవాత్మక అడుగులు లైఫ్ సైన్సెస్ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చే ప్రయాణంలో థెరానిమ్ బయోలాజిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మరొక కీలక మైలురాయి అని.. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఇకడ ఉత్పత్తి చేసి.. యూఎస్ సహా పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్టుగా వివరించారు.