పలు వారాలుగా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న స్టాక్ మార్కెట్.. అదానీ గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో హఠాత్తుగా పతనమయ్యింది. గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 424 పాయింట్ల భారీ నష్టంతో 17,604 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకే వారంలో రెండు కీలకమైన మూవింగ్ ఏవరేజ్లను (100 డీఎంఏ, 20 వీక్ ఎంఏ) నిఫ్టీ కోల్పోయినందున టెక్నికల్ సెటప్ దెబ్బతిన్నదని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ చెప్పారు. హిండన్బర్గ్ రిపోర్ట్లో చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అయినందున ఈ వారం సైతం దీని ప్రభావం మార్కెట్లో ఉంటుందని, మరోవైపు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు వెలువడనున్నందున స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావొచ్చని అంచనా వేశారు.
సాంకేతికంగా 20 వారాల మూవింగ్ ఏవరేజ్ కదులుతున్న 17,900 స్థాయిని, దీనికి సమీపంలో 17,950 వద్దనున్న 100 రోజుల మూవింగ్ ఏవరేజ్ను ఒక్కసారిగా కోల్పోయినందున, సమీపకాలంలో 17,950 దిగువన నిఫ్టీ కొనసాగినంతవరకూ మార్కెట్ బలహీనంగానే ఉంటుందని వైష్ణవ్ అంచనా వేశారు. ఈ వారం 17,750-17,860 శ్రేణి గట్టి అవరోధాన్ని కల్పించవచ్చని, 17,400, 17,250 పాయింట్ల వద్ద మద్దతును పొందవచ్చన్నారు. నిఫ్టీకి తక్షణం 17,500 మద్దతు లభిస్తున్నదని, ఈ స్థాయిని కోల్పోతే 16,750 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోది అంచనా వేశారు. 17,800 స్థాయి నిరోధించవచ్చన్నారు.