(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభం ముగిసి రెండేండ్లవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే నడుస్తున్నది. 2021 అక్టోబర్తో చూస్తే 2022 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతంలోకి జారుకోవడమే ఇందుకు నిదర్శనం. నిజానికి పారిశ్రామికాభివృధ్ధి కుంటుబడటానికి కరోనా, లాక్డౌన్లే కారణమని అనుకోవడానికి వీల్లేదు. 2011-12 నుంచి 2019-20 మధ్య ఐఐపీ సూచిక ప్రకారం సగటు వార్షిక పెరుగుదల 3.2 శాతం. ఇది గత సంవత్సరాలతో పోల్చితే చాలా తక్కువ. 1956 ఆధారిత సూచీ ప్రకారం పారిశ్రామికోత్పత్తి ఏటా 7 శాతం కంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 2004-05 నుండి 2014-15 మధ్య కూడా సగటు వార్షిక వృద్ధిరేటు 5.87 శాతంగా నమోదైంది. కానీ, ఇటీవలి కాలంలో పారిశ్రామిక వృద్ధిరేటు చాలా కుంటుపడిందని, దీనికి కేంద్రంలోని బీజేపీ ఆర్థిక విధానాలే కారణంగా చెప్పవచ్చని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
పారిశ్రామిక మందగమనానికి ఆదాయ పంపిణీలో పెరుగుతున్న అసమానత, చిన్న-మధ్యతరగతి తయారీ సంస్థల నిర్వీర్యం, ఎగుమతులు క్షీణించి, దిగుమతులు పెరగటం కారణాలుగా చెప్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలలో కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణించడం ముఖ్య కారణంగా తెలుస్తున్నది. పారిశ్రామికోత్పత్తిని విశ్లేషిస్తే మూలధన వస్తువులు, వినియోగ వస్తువులుగా చెప్పుకోవచ్చు. రెండు కేటగిరీల్లో వినియోగ వస్తువుల సూచిక 2011-12 సగటు కంటే గణనీయంగా తగ్గింది. అలాగే ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటం కూడా పరిస్థితులను దిగజార్చుతున్నది.
ఇక నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలు కూడా మందగిస్తుండటంతో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. 2020 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల సంఖ్య సుమారు 40 లక్షలుంటే అందులో 8 లక్షలకుపైగా ఖాళీలే. అంటే ప్రతీ వేయిమంది అర్హులైన జనాభాకు 16 మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. 85 కోట్ల శ్రామిక వర్గంలో 93 శాతం ఉద్యోగులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు.
ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో దేశంలో 7 లక్షల 84 వేల 841 రిజిస్టర్డ్ కంపెనీలు మూతబడినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే సగటున రోజుకు 270 సంస్థలకు తాళాలు పడ్డాయి. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంలో భాగమైన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ నివేదికే బయటపెట్టింది. మరోవైపు గడిచిన ఎనిమిదేండ్లలో నిత్యావసరాల ధరలు ఏకంగా 300 శాతం పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలపై పెను ఆర్థిక భారమే పడింది. ఫలితంగా గృహోపకరణాలు, ఇతరత్రా వస్తువుల కొనుగోళ్లు తగ్గడంతో డిమాండ్ క్షీణించి.. పారిశ్రామికాభివృద్ధి ప్రభావితమైనట్టు పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2016లో నోట్ల రద్దు కూడా ఒక పెద్ద ప్రహసంగా చెప్పవచ్చు. మోదీ సర్కారు నిర్ణయం సమాజంలో పెద్ద అలజడుల్నే రేపింది. నోట్ల రద్దుతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులు కుదేలయ్యారు. అలాగే జీఎస్టీ కూడా దెబ్బతీసింది. మరోవైపు బడా వ్యాపారులకు కేంద్రంలోని పెద్దలు వత్తాసు పలకడం పరిస్థితుల్ని మరింతగా దిగజార్చింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో పారిశ్రామికాభివృధ్ధి కోసం మే కిన్ ఇండియా అం టూ అట్టహాసంగా ప్రకటించి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉత్త మాటలే అయ్యాయి. ఈ వైఫల్యానికి పాలకుల విధానాలే కారణమన్న విమర్శలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయిప్పుడు.
ఆశ్రిత పక్షపాతంతో కొంతమంది కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ఉద్దీపనలు, రుణమాఫీలు కల్పించడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందే తప్ప.. దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకోలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించాలన్న తపనలో పదోవంతు జీడీపీ బలోపేతంపై కేంద్రానికి ఉన్నా.. భారత్ వృద్ధిపథంలో నడిచేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి లక్షల కోట్ల రూపాయల విలువైన జాతి సంపదను అమ్మేస్తూ దేశాన్ని పేదరికంలోకి నెడుతున్నారని అంటున్నారు.