Smart TV Price | న్యూఢిల్లీ, మార్చి 29 : స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని కౌంటర్పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయినప్పటికీ దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో స్మార్ట్ టీవీ దిగుమతులు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొంది. కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా అతిపెద్ద స్క్రీన్ టీవీలకు అప్గ్రేడ్ అవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి. ప్రీమియం మాడళ్లను సైతం ఆన్లైన్లో చూసి కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలుదారులు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్పై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం టీవీలకు పెరుగుతున్న డిమాండ్తో సరాసరి వీటి విక్రయ ధర కూడా అధికం కాబోతున్నది. దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో గతేడాది టీవీల దిగుమతులు 16 శాతం మేర తగ్గిన విషయం తెలిసిందే. దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 93 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని తన నివేదికలో వెల్లడించింది. 43 అంగుళాల కలిగిన క్యూలెడ్ టీవీలను విక్రయిస్తున్న టీసీఎల్, ఏసర్, కొడక్, థామ్సన్, ఇతర బ్రాండ్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.