అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం చల్లారడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్వేస్తుందన్న అంచనాలు నెలకొనడంతో గతవారం ప్రపంచ మార్కెట్లలో హఠాత్తుగా సానుకూల ట్రెండ్ ఏర్పడింది. దీంతో మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా జరిపిన షార్ట్ కవరింగ్ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 415 పాయింట్లు లాభపడి 17,360 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో పలు అవరోధస్థాయిల్ని అధిగమించినందున, ఈ వారం స్టాక్ సూచీలు పాజిటివ్గా కదులుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహవీర్ జయంతి, గుడ్ఫ్రైడే సెలవుల కారణంగా మూడు రోజుల ట్రేడింగ్కే పరిమితం కానున్న ఈ వారంలో 6 వ తేదీన వెలువడే ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం తదుపరి రోజుల్లో మార్కెట్ను నిర్దేశిస్తుందని నిపుణులు చెపుతున్నారు.
17,500-600 శ్రేణి లక్ష్యం
ఈ వారం నిఫ్టీ 17,500-600 శ్రేణి లక్ష్యంగా కదలవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. మార్చి డెరివేటివ్ సిరీస్లో గట్టిగా నిరోధించిన 17,200 పాయింట్ల స్థాయిని దాటినందున సమీప లక్ష్యం 17,500-17,550 వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నట్టు యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా చెప్పారు. 17,200 స్థాయిని కోల్పోకపోతే 17,500-17,600 వరకూ పెరగవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు.