అదానీ గ్రూప్ ప్రతికూల, సానుకూల వార్తల నడుమ గతవారంలో స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 250 పాయింట్ల శ్రేణిలో కదిలిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్లాట్గా 17,856 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా మన మార్కెట్ కదలవచ్చని, అమెరికా, చైనాల ఆర్థిక వ్యవస్థలపై అంచనాలు, రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ అధికారులు వెల్లడించే అభిప్రాయాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు. సాంకేతికంగా బడ్జెట్ రోజున ఏర్పడిన క్యాండిల్ నిఫ్టీ అప్మూవ్ను నియంత్రిస్తున్నదని, ఈ క్యాండిల్ను అధిగమించేంతవరకూ నిఫ్టీ 50 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఏవరేజ్ (50 డీఈఎంఏ), 200 డీఈఎంఏల మధ్య పరిమితశ్రేణిలోనే కదులుతుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ అంచనా వేశారు. డెరివేటివ్స్ విభాగంలో విదేశీ ఇన్వెస్టర్ల షార్ట్ పొజిషన్లు పెరిగాయని, వారు షార్ట్స్ను కవర్ చేసుకుంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని 5 పైసా కామ్ రీసెర్చ్ హెడ్ రుచిత్ జైన్ తెలిపారు.
కీలక నిరోధం 18,000
రానున్న రోజుల్లో నిఫ్టీ కదలికలకు 18,000 పాయింట్ల వద్దనున్న నిరోధం కీలకమని విశ్లేషకులు తెలిపారు. ఈ స్థాయిని దాటి, స్థిరపడితే 18,250 పాయింట్ల వరకూ పెరగవచ్చని జిమీత్ మోది చెప్పారు. 17,600 వద్ద మద్దతు పొందవచ్చన్నారు. ఆప్షన్ బిల్డప్ అధికంగా ఉన్న 18,000 స్థాయిని అధిగమిస్తే 18,200-18,250 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చని, 17,800-17,700 పాయింట్ల మద్దతు శ్రేణిని కోల్పోతే 200 ఈఎంఏ రేఖ కదులుతున్న 17,550 స్థాయి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని రుచిత్ జైన్ వివరించారు.