ముంబై, జూన్ 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గృహ రుణాలు తీసుకునేవారికి షాకిచ్చింది. గృహ రుణాలపై కనీస వడ్డీని అమాంతం 7.55 శాతానికి పెంచింది. ఈ పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. గతవారంలో రిజర్వుబ్యాంక్ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రేటు 4.90 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే.
దీంతో క్రమంగా ఒక్కో బ్యాంకు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ, బీవోబీలు వడ్డీరేట్లను సవరించాయి. ఎస్బీఐ కూడా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్-బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్)ని కనీస వడ్డీరేటును 7.05 శాతం నుంచి 7.55 శాతానికి పెంచింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. దీంతోపాటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లతోపాటు నాన్-రెసిడెంట్ ఆర్డినరీ(ఎన్ఆర్వో), నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్(ఎన్ఆర్ఈ)పై వడ్డీరేటును సవరించింది. సవరించిన రేట్లు తక్షణమే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఏడాది నుంచి 400 రోజుల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5.20 శాతం నుంచి 5.45 శాతానికి, 2-3 ఏండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 5.20 శాతం నుంచి 5.50 శాతానికి సవరించింది. మరోవైపు, ఐడీబీఐ బ్యాంక్ కూడా రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.