న్యూఢిల్లీ, జూలై 20: ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో భాగంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ)ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఎల్టీసీజీ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేసే అంశంపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్కు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ సమాచారం ఇచ్చారు.
2024-25 మదింపు సంవత్సరంలో రూ. 72,249 కోట్లుగా వసూలైన ఎల్టీపీజీ ట్యాక్స్.. ఆ తర్వాతి సంవత్సరంలో 78 శాతం ఎగబాకి రూ.1.29 లక్షల కోట్లకు చేరుకున్నది. సాధారణంగా షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ను దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 12 నెలల కంటే ఎక్కువకాలం పాటు హోల్డ్ చేస్తే వాటిని లాంగ్టర్మ్ అసెట్స్గా పరిగణిస్తారు. వీటిపై 12.5 శాతం ఎల్టీసీజీ పన్నును వసూలు చేస్తారు.