ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీగా ఐఐఎల్ను తీర్చదిద్దే ఉద్దేశంలో భాగంగా హైదరాబాద్లో నూతన వ్యాక్సిన్ కేంద్రానికి శింకుస్థాపన చేశాం.
– మీనేశ్ షా, ఎన్డీడీబీ చైర్మన్
హైదరాబాద్, డిసెంబర్ 28: దేశంలో అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయతలపెట్టిన వ్యాక్సిన్ యూనిట్కు శంకుస్థాపన చేసింది. సిద్దిపేట జిల్లాలోని కర్కపట్ల బయోటెక్ పార్క్లో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ యూనిట్తో 750 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చరర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ) కేటాయించిన భూమిలోనే గురువారం శంకుస్థాపన చేసినట్టు కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ యూనిట్లో ఏడాదికి 150 మిలియన్ల డోస్ల ఎఫ్ఎండీ వ్యాక్సిన్లతోపాటు 150 మిలియన్ డోసుల ఎఫ్ఎండీ+హెచ్ఎస్ వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయి. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ) సబ్సిడరీ సంస్థయైన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్… జంతు, మానవ టీకాలను తయారు చేసి, వీటిని ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్ఎండీ వ్యాక్సిన్ల సరఫరాలో అతిపెద్ద సంస్థ మాదేనని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కే ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కూడా 40 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.