న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ అంచనాలో ఇది 37.3 శాతానికి సమానం. ఈ మేరకు సోమవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అయితే నిరుడు ఇదే వ్యవధిలో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలో 35 శాతానికే పరిమితం కావడం గమనార్హం. కాగా, 2022-23లో ప్రభుత్వ ద్రవ్యలోటు 16.61 లక్షల కోట్లుగా లేదా దేశ జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని బడ్జెట్ సందర్భంగా మోదీ సర్కారు అంచనా వేసిన విషయం తెలిసిందే.
ద్రవ్యలోటు అంటే ఏమిటి?
ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ద్రవ్యలోటు, ద్రవ్యమిగులుగా కొలుస్తారు. ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యమిగులుగా భావిస్తారు.
ద్రవ్యలోటు పెరిగితే ఏమవుతుంది?
పెరిగే ద్రవ్యలోటు ప్రభుత్వ ఖర్చులకు అద్దం పడుతుంది. అధిక ద్రవ్యలోటు ప్రభుత్వాన్ని మరింత అప్పులపాలుజేస్తుంది. మార్కెట్లో నిధుల కొరతకు దారితీస్తుంది. అన్ని రంగాలకు పెట్టుబడులు కరువవుతాయి. అధిక వడ్డీరేట్లకు కారణమవుతుంది. ఫలితంగా దేశ వృద్ధిరేటు క్షీణిస్తుంది.