హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశ ఫార్మారంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని ఫార్మారంగ నిపుణులు ఎలుగెత్తి చాటారు. ఫార్మారంగానికి మరే రాష్ట్రం కల్పించనంత ప్రాధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. రంగారెడ్డి జిల్లా చేగూర్లోని కాన్హా శాంతివనంలో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ బయాలజీ, మెడిసిన్ (బయోమీ-23)’ అనే అంశంపై మూడురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణల విషయంలో తెలంగాణ దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వందమైళ్ల ముందున్నదని సదస్సులో పాల్గొన్న నిపుణులు తెలిపారు.
రాష్ట్ర గురుకుల విద్యాలయాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా బయో, ఫార్మా రంగంలో మార్పు లు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా నూతన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మానవాళికి కరోనా లాంటి వైరస్ సవాల్ విసిరిందన్నారు. మానవాళిని నిత్యం కాపాడేది విజ్ఞానం, పరిశోధన మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు పాటుపడుతున్నదని, అందులో భాగమే ఈ సదస్సు అని ఆయన వివరించారు. సదస్సులో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రెడ్డన్న, హావెల్ లైఫ్సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్, ఫ్రాన్స్ దౌత్యవేత్త స్టాన్లాస్ లాజుగె, అమెరికా టోలెడో యూనివర్సిటీ ప్రొఫెసర్ సాట్ హాల్, ఫార్మా రంగ నిపుణులు డాక్టర్ దర్శనా జోషి, గిరిజన సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి వీ. సర్వేశ్వర్రెడ్డి, ప్రొఫెసర్ అమిత్ తివారి తదితరులు పాల్గొన్నారు.
గురుకుల విద్యాలయాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. ఆ దిశగా పరిశోధన, కఠోర శ్రమ ఉండాలి. దేశ ఫార్మా రంగానికి హైదరాబాద్ గుండెకాయలాంటిది. బయో, ఫార్మా రంగాల విషయంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతి సాధించింది. దేశీయంగా 75 వేల స్టార్టప్లు ఆవిర్భవిస్తే అందులో హైదరాబాద్కు చెందినవి 8 వేలు ఉంటాయి. నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
– పన్నీరు సెల్వం, టెక్నోజిన్ సీఈవో-టీ హబ్ మాజీ వైస్ ప్రెసిడెంట్
ఫార్మా రంగం నిత్యనూతనమైంది. విద్యార్థి దశ నుంచే పరిశోధనా రంగంపై ఆసక్తి పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తున్నది. విద్యార్థి దశలోనే అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేసే స్థాయికి తెలంగాణ విద్యార్థులు ఎదిగినందుకు గర్వంగా ఉన్నది.
– డాక్టర్ రాంకిషన్, భారత డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా