IT Sector | ముంబై, మార్చి 18: దేశీయ ఐటీ రంగానికి నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. గత కొన్నేండ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ ఐటీ రంగ సంస్థలకు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితంకానున్నదని సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి 3-5 శాతం మధ్యలో నమోదుకానున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. అలాగే ఆదాయం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండనుండటంతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్ వేసే అవకాశాలున్నాయని తెలిపింది.
అయినప్పటికీ టాప్లైన్ వృద్ధిపై ఆందోళన వ్యక్తమైనప్పటికీ లాభదాయకత మాత్రం స్థిరంగా ఉంటుందని వెల్లడించింది. 250 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ రంగ సంస్థల ఆపరేటింగ్ ప్రాఫిట్లో 21-22 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఐటీ సంస్థల ఆదాయం కేవలం రెండు శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్నది. గతంలో అంచనావేసిన 3-5 శాతం స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. అలాగే టాప్లైన్ వృద్ధి సరాసరిగా 9.2 శాతంగా ఉన్నది. అంతర్జాతీయ దేశాల్లో ఆర్థిక మాంద్యం చాయలు నెలకొనడం, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండటం ఇందుకు కారణమని తెలిపింది.
మహిళా ఉద్యోగ కల్పనలో వృద్ధి
మహిళలకు ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను క్యాంపస్లలో నిర్వహించిన రిక్రూట్మెంట్లలో 5 శాతం వరకు పెరిగారని తాజా నివేదిక వెల్లడించింది. 2022-23లో దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మహిళల వాటా 40 శాతానికి చేరుకున్నదని, క్రితం ఏడాది ఇది 35 శాతంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హిర్ప్రో నివేదికలో తెలిపింది.
ఈ నివేదికను దేశవ్యాప్తంగా ఉన్న 5.50 లక్షల మంది బీటెక్ విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించింది. ముఖ్యంగా ఐదు జోన్లవారీగా విడగొట్టి, సెంట్రల్, తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమర ప్రాంతాల నుంచి సేకరించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగిన పరీక్షల్లో పాల్గొన్న అత్యధిక మంది మహిళల్లో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది మహిళలకు ఐటీ రంగానికి మొగ్గుచూపారు. జోన్లవారీగా చూస్తే 2022-23లో క్యాంపస్లలో నిర్వహించిన పరీక్షలో దక్షిణ భారతంలో అత్యధిక మంది 39 శాతం మంది హాజరయ్యారు. అలాగే తూర్పు భారతంలో తక్కువగా 24 శాతంగా ఉన్నది. పశ్చిమ జోన్ వాటా 34 శాతంగా, సెంట్రల్ జోన్ 28 శాతం, నార్త్ జోన్ వాటా 27 శాతంగా ఉన్నదని తెలిపింది.
అంతర్జాతీయ దేశాలైన అమెరికా, యూరప్లో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థలు ఐటీపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్నారు. దీంతో దేశీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.
– దీపక్ జోత్వాని, ఇక్రా ఐటీ హెడ్