న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతున్నది. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో షిప్మెంట్స్ 38 శాతం పెరిగాయి. పండుగ సీజన్ అమ్మకాలు, మార్కెట్లో నూతన మోడల్స్ ఆవిష్కరణలు, డిస్కౌంట్లు, ప్రమోషన్లు కలిసొచ్చాయని కౌంటర్పాయింట్ రిసెర్చ్ రిపోర్టులో తేలింది. కాగా, డాల్బీ ఆడియో, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ టీవీలపట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. గతంతో చూస్తే స్మార్ట్ టీవీలను కస్టమర్లు ఎక్కువగా ఆదరిస్తున్నారని, పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ఇవి ఉండటమే కారణమని అంటున్నారు. ఈ క్రమంలోనే రూ.20వేల ధరల శ్రేణిలో మరిన్ని మోడల్స్ మున్ముందు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గాలకూ స్మార్ట్ టీవీలు చేరువ కాగలవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆన్లైన్దే హవా
సంప్రదాయ మార్కెట్ కంటే ఆన్లైన్లోనే టీవీలను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నట్టు కౌంటర్పాయింట్ రిసెర్చ్ రిపోర్టులో స్పష్టమైంది. ఈ జూలై-సెప్టెంబర్లో వివిధ ఈ-కామర్స్ వేదికల ద్వారా జరిగిన షిప్మెంట్స్ 35 శాతం పెరిగాయని, అన్ని ప్రధాన ఆన్లైన్ మార్కెటీర్లు పెట్టిన ఆఫర్లే ఇందుకు కారణంగా చెప్తున్నది. పండుగల సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్లు దోహదపడినట్టు పేర్కొన్నది. ఇదిలావుంటే చైనాకు చెందిన షియామీ (రెడ్మీ బ్రాండ్ కూడా) బ్రాండ్ స్మార్ట్ టీవీలు.. దేశీయ మార్కెట్లో తమ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జూలై-సెప్టెంబర్లో 11 శాతం వాటాతో ముందున్నాయి. 10 శాతంతో సామ్సంగ్, 9 శాతంతో ఎల్జీ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. వన్ప్లస్ స్మార్ట్ టీవీల సేల్స్ కూడా గణనీయంగా పెరుగుతుండటం విశేషం. భారత్కు చెందిన వీయూ బ్రాండ్కూ ఆదరణ పెరుగుతున్నదంటున్నారు.