దేశ ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్లో పోతున్నది.
భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఒక్కొక్కటిగా రేటింగ్ ఏజెన్సీలు సవరిస్తున్నాయి మరి.
గత అంచనాలకు దాదాపు 1 శాతం మేర కోత పెడుతుండటం దేశ ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నదిప్పుడు.
న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశ వృద్ధిరేటు అంచనాలకు మరోమారు కత్తెర పడింది. తాజాగా గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ 7 శాతానికే పరిమితం కాగలదని సోమవారం అంచనా వేసింది. ఇంతకుముందు 7.3 శాతం గా అంచనా వేయడం గమనార్హం. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను గతంలో వేసిన అంచనాలనూ సవరించింది. ఈ క్రమంలోనే 6.5 శాతం నుంచి 6 శాతానికి తీసుకొచ్చింది. నిజానికి రెండు నెలల క్రితమే భారత జీడీపీపై ఎస్అండ్పీ తమ అంచనాలను విడుదల చేసింది. అయితే ఇంతలోనే వాటిని తగ్గిస్తూ కొత్త అంచనాలను వెల్లడించడం దేశ ఆర్థిక వ్యవస్థ రివర్స్ గేర్లోకి వెళ్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది. చివరిసారిగా ఈ సెప్టెంబర్లో దేశ జీడీపీపై ఎస్అండ్పీ తమ అంచనాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పుడప్పుడే తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా ఎస్అండ్పీ అంచనాలుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం సగటు 6.8 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారికి పెట్టుకున్న లక్ష్యం 6.25 శాతమే కావడం గమనార్హం. దీంతో ఆర్బీఐ లక్ష్యసాధన కలగానే మిగిలేట్టున్నది. నిజానికి 6 నెలల క్రితందాకా జీడీపీ పెంపే ధ్యేయంగా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్షలు చేస్తున్నది. ఈ క్రమంలోనే రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫలితంగా గృహ, వాహన రుణాలుసహా అన్నింటిపైనా వడ్డీరేట్లు పెరిగాయి. ఈ పరిణామం మార్కెట్నూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రస్తుతం రెపో రేటు మూడేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 5.9 శాతం వద్ద ఉన్నది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్ లేదా క్యూ2)లో దేశ జీడీపీ వృద్ధి 5.8 శాతంగానే నమోదు కావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేసింది. సగటు అంచనాల కంటే ఇది 30-50 బేసిస్ పాయింట్లు (0.3-0.5 శాతం) తక్కువ కావడం గమనార్హం. అయితే బుధవారం కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు విడుదల కానున్న క్రమంలో ఇది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కాగా, జీడీపీలో సింహ భాగమైన తయారీ రంగం మందగమనంలోకి జారుకోవడమే వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్నదని ఎస్బీఐ ఈ సందర్భంగా పేర్కొన్నది.
అలాగే బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థలు మినహా మిగతా కార్పొరేట్ కంపెనీల క్యూ2 నిర్వహణ లాభాలు గతంతో పోల్చితే 14 శాతం పడిపోవడం కూడా నిరాశాజనకంగా మారిందని ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక అధిపతి సౌమ్యకాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. నిరుడు ఇదే వ్యవధిలో 35 శాతం వృద్ధి ఉందని గుర్తుచేశారు. పెరిగిన ఉత్పాదక వ్యయమే ఇందుకు కారణమని చెప్పారు.