Alibaba backs PayTM | ఐపీవో ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలన్న ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం వ్యూహం దెబ్బ తినడానికి కారణాలేమిటి.. దీని వెనుక డ్రాగన్ ఉందా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. రూ.18,300 కోట్ల నిధుల సేకరణతో గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టయిన పేటీఎం స్క్రిప్ట్పై 9 శాతం రాయితీ ఇచ్చారు. కానీ ఆఫర్లతో కస్టమర్లకు చేరువ అవుతున్న పేటీఎం షేర్ మున్ముందు 40 శాతం వరకు పతనం అవుతుందని గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మేజర్ మాక్వైరీ అంచనా వేసింది. పేటీఎంతోపాటు యూపీఐ పేమెంట్స్లో పలు సంస్థలు భాగస్వాములు అవుతున్న వేళ పేటీఎం సవాళ్లను ఎదుర్కోబోతున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, పేటీఎంలో గణనీయ స్థాయిలో చైనా సంస్థల పెట్టుబడులు ఉండటం వల్లే ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడలేదని సందేహాలు ఉన్నాయి. పేటీఎంలో చైనా సంస్థలకు 30 శాతానికిపైగా వాటా ఉంది. ఇప్పటికే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లైసెన్స్ కోసం ఆర్బీఐకి పేటీఎం దరఖాస్తు చేసింది. ప్రస్తుతం చైనా-భారత్ మధ్య సరిహద్దు వివాదాల నేపథ్యంలో పేటీఎంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ లభించడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశీయ సంస్థల్లో చైనాపెట్టుబడి ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఈ తరుణంలో పేటీఎం ప్రతిపాదనకు ఆర్బీఐ, ప్రభుత్వం జాగ్రత్తగా స్పందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా, దాని అనుబంధ ఆంట్ గ్రూప్ సంస్థలకు ప్రస్తుతం పేటీఎంలో 31 శాతం వాటా ఉంటుంది. ఐపీవో ప్రక్రియ పూర్తయిన తర్వాత అది 15 శాతానికి తగ్గుతుంది. ఇప్పుడు పేటీఎంకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ మాత్రమే ఉంది. పేమెంట్స్ బ్యాంక్ కమర్షియల్ ఆపరేషన్స్ ఐదేండ్లు పూర్తి చేసుకున్న తర్వాత పేటీఎం.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ పొందేందుకు అర్హత పొందుతుంది. కానీ 15 శాతం వాటాలు ఉన్న చైనా సంస్థలు ఆలీబాబా, దాని అనుబంధ ఆంట్ గ్రూప్ సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తాయన్న సందేహాలు ఉన్నాయి.