న్యూఢిల్లీ, మే 30: దేశంలో క్రిప్టోకరెన్సీల విధానంపై కేంద్ర ప్రభుత్వం ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కన్సల్టేషన్ పేపర్ను కేంద్రం త్వరలోనే ఖరారు చేయనుందని ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ సోమవారం తెలిపారు. ఈ విషయంలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తదితర సంస్థలు, భాగస్వాముల అభిప్రాయాలను ఇప్పటికే అందుకున్నట్టు చెప్పారు.
టెక్నాలజీపరంగా ఎన్నో మార్పులకు లోనవుతున్న ప్రస్తుత ఈ వర్చువల్ ప్రపంచంలో క్రిప్టోకరెన్సీలపట్ల ఉన్న ఆందోళనల పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం కూడా అవసరమని ఈ సందర్భంగా అజయ్ అన్నారు. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ఇప్పటికే చాలాసార్లు స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఈ క్రిప్టోకరెన్సీలతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజయ్ తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
దేశ, విదేశీ సంస్థాగత భాగస్వాముల అభిప్రాయాలను సేకరించామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 6-12 మధ్య ‘ఐకానిక్ వీక్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ’ కార్యక్రమం జరగనుండగా, దీనికి సన్నాహక కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అజయ్.. క్రిప్టోకరెన్సీలపై గ్లోబల్ రెగ్యులేషన్లనూ పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. క్రిప్టో రెగ్యులేషన్పై ప్రపంచ ఏకాభిప్రాయం అవసరమన్నారు.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) కార్యదర్శి సంజయ్ మల్హోత్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్పరం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, రెండు ప్రభుత్వ బ్యాంకులతోపాటు ఓ బీమా రంగ సంస్థ పేరునూ ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లున్నట్టు తెలుస్తున్నది.