న్యూఢిల్లీ, జూన్ 22: బ్యాంక్లను రూ.34,615 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్), దాని ప్రమోటర్లు మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ సీబీఐ నమోదు చేసిన అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ ఇదే. ఈ నెల 20న ఈ కేసు రిజిష్టర్ చేసామని, ఇందుకు సంబంధించి ముంబైలో అమరెల్లీస్ రియాల్టర్స్ అధిపతి సుధాకర్ శెట్టి, మరో 8 మంది బిల్డర్లకు చెందిన 12 ఆవరణల్లో 50 మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించినట్లు బుధవారం సీబీఐ అధికారులు చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేసినట్టు వారు తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు 2010-2018 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని 17 బ్యాంక్ల కన్సార్షియం రూ.42,871 కోట్ల రుణ సదుపాయాల్ని కల్పించింది. కపిల్, ధీరజ్ వాద్వాన్లు 2019 మే నుంచి రుణ చెల్లింపుల్ని ఎగవేసి, బ్యాంక్లను రూ. 34,614 కోట్ల మేర మోసపుచ్చినట్టు యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. వాధ్వాన్లు ఆస్తుల్ని కూడబెట్టేందుకు డీహెచ్ఎఫ్ఎల్ ప్రజా ధనాన్ని మళ్లించి, ఖాతా పుస్తకాల్ని తారుమారు చేసినట్టు ఆడిట్లో వెల్లడైందని ఫిర్యాదులో పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ రుణ ఖాతాల్ని బ్యాంక్లు వేరు వేరు సమయాల్లో ఎన్పీఏలుగా ప్రకటిస్తూ వచ్చాయి. వాస్తవానికి డీహెచ్ఎఫ్ఎల్ నిధులు మళ్లిస్తున్నదంటూ మీడియాలో 2019 జనవరిలో వార్తలు వెలువడంతో కంపెనీ ఖాతాపుస్తకాల్ని ఆడిట్ చేయడానికి కేపీఎంజీని బ్యాంక్లు నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచివెళ్లకుండా అదే ఏడాది అక్టోబర్లో బ్యాంక్లు లుక్అవుట్ నోటీసుల్ని జారీచేసాయి.
మరో ఫ్రాడ్ కేసులో ప్రస్తుతం కపిల్, ధీరజ్ వాధ్వాన్లు ఇరువురూ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు రూ.600 కోట్లు ముడుపులిచ్చి, ఆ బ్యాంక్ నుంచి రుణం పొందిన కేసులో వాధ్వాన్లపై గతంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కేసులు పెట్టాయి. రాణా కపూర్ సైతం ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. దివాలాతో ఎన్సీఎల్టీ చెంతనున్న డీహెచ్ఎఫ్ఎల్ను నిరుడు సెప్టెంబర్ నెలలో రూ.34,250 కోట్లకు పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కొనుగోలు చేసింది.