Twitter Blue Tick | టెక్ దిగ్గజంగానూ.. సంచలన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన టెస్లా సీఈవో ఎలన్మస్క్.. తాజాగా ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత సదరు సోషల్ మీడియా సంస్థ ఆదాయం పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఇతర కంపెనీల పుట్టి ముంచుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి 8 అమెరికా డాలర్లకు బ్లూ టిక్ వెరిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే, దీనివల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయి.. ఎవరు అసలైన ఖాతాదారులో, ఎవరు నకిలీలో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది.
గతంలో ప్రభుత్వాల అధినేతలు, ప్రతినిధులకు, ప్రముఖులకు మాత్రం విడిగా వెరిఫికేషన్ ఉండేది. కానీ, ఇప్పుడు ఎవరూ మనీ చెల్లించగలిగినా బ్లూటిక్ వెరిఫికేషన్ బ్యాడ్జి రావడంతో నకిలీలు రెచ్చిపోయి చేసిన ట్వీట్.. ఒక ఫార్మా కంపెనీ భారీగా అక్షరాల రూ.1.12 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, మరో కంపెనీ ఎం-క్యాప్ కోల్పోవడానికి కారణమైంది.
అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ.. మధుమేహ రోగులకు `ఇన్సూలిన్` తయారు చేస్తుంది. 8 డాలర్లకు బ్లూటిక్ వెరిఫికేషన్ అమల్లోకి రావడంతో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ పేరిట ట్విట్టర్లో ఒక బ్లూటిక్ ఖాతా మొదలైంది. `ఉచితంగా ఇన్సూలిన్ ఇస్తున్నామని చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం` అంటూ ఎలీ లిల్లీ అండ్ కంపెనీ పేరిట ఒక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ వెలుగు చూసింది.
ఇది ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ఇన్వెస్టర్లకు కోపం తెప్పించింది. ఈ కంపెనీలో షేర్లన్నీ ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు. అసలు ఎలీ లిల్లీ అండ్ కంపెనీకి విషయం తెలిసే లోపు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. తప్పుడు బ్లూ టిక్ ఖాతా చేసిన పోస్ట్ వల్ల ఎలీ లిల్లీ అండ్ కంపెనీ స్టాక్ 4.37 శాతం నష్టపోయింది. అంటే రూ.1.12 లక్షల కోట్ల లాస్ను చవిచూసింది ఎలీ లిల్లీ అండ్ కంపెనీ.
వెంటనే అప్రమత్తమై సదరు ట్వీట్తో తమకు సంబంధం లేదనిఎలీ లిల్లీ అండ్ కంపెనీ ప్రకటన ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే స్టాక్ మార్కెట్లలో సంస్థ స్టాక్ 368 నుంచి 345 డాలర్లకు పతనమైంది. అంటే 15 బిలియన్ డాలర్ల మేరకు ఎం-క్యాప్ కోల్పోయంది.
రక్షణ రంగంలో పేరొందిన ఆయుధాల తయారీ కంపెనీ పేరిట వచ్చిన తప్పుడు ట్వీట్తో `లాక్హిడ్ మార్ట్`కు కూడా నష్టాలు మిగిలాయి. అమెరికా, సౌదీ అమెరికా, ఇజ్రాయెల్లలో మానవ హక్కుల ఉల్లంఘన నిలిచిపోయే వరకు ఆ దేశాలకు ఆయుధాలు సరఫరా చేయం అని లాక్హిడ్ మార్ట్ పేరిట ఏర్పాటైన ట్వీట్తో ఇన్వెస్టర్లు ఘాటుగా రియాక్టయ్యారు. ఫలితంగా కంపెనీ షేర్ 5.5 శాతం వరకు నష్టపోయింది.