హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని తాము ఎంచుకున్న రంగాల్లో మరింత ఎదిగేందుకు ఆస్కారం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు మహిళలు విజయవంతంగా పరిశ్రమలను నిర్వహిస్తూ తమను తాము నిరూపించుకున్నారని, ప్రపంచ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించారని వారు ఉదాహరించారు. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య(ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగనున్న ఈ కార్యక్రమంలో నిమ్స్మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప, ఎలికో ఈడీ వనితా దాట్ల, ఎఫ్టీసీసీఐ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ చైర్మన్ భగ్వతీ దేవీ, సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ఉందని వారు పేర్కొన్నారు. అయినా మహిళల ఎదుగుదలకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు వివరించారు. మహిళలు ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.