హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర రంగాల్లో ‘తెలంగాణ-మారిషస్’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్మనన్ పెంతియాతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మారిషస్కు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026’లో పాల్గొనాలని లుచ్మనన్ను శ్రీధర్బాబు ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ విద్యాసంస్థలతో పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు, పరిపాలనా విధానాలపై వారికి శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని శ్రీధర్బాబును ఆయన కోరారు.